మీకు నిజంగా దమ్ముంటే నన్ను జైలుకు పంపండి చూద్దాం అంటూ సీఎం కేసీఆర్ బీజేపీకి సవాలు విసరడం.. సత్తా ఉంటే ఐటీ,ఈడీ దాడులు జరపండంటూ టీఆర్ఎస్ నేతలూ వరుస ప్రకటనలు చేస్తున్న క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భారీ బాంబు పేల్చారు. ఆంధ్రాకు చెందిన ఈ నేత అనూహ్య రీతిలో బుధవారం నాడు తెలంగాణ రాజ్ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. గవర్నర్ తమిళిసైతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్ అన్నీ సంచలన విషయాలే చెప్పుకొచ్చారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అవినీతిమయమని, ఏడేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రూ.8లక్షల కోట్లు అక్రమంగా పోగేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ బోధకుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ తమిళిసైతో పాల్ భేటీ అయ్యారు. అనంతరం రాజ్ భవన్ ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అరెస్టుపై కేఏ పాల్ జోస్యం చెప్పారు.
కేసీఆర్ ను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు పదేపదే కామెంట్లు చేస్తున్న క్రమంలో ఇప్పుడు వారికి కేఏ పాల్ తోడయ్యారు. కేసీఆర్ ఏడేళ్లలో 8 లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని, ఇంత అవినీతి చరిత్రలో ఎప్పుడూ చూడలేదని, రేపో మాపో సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని, ఈ మేరకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోందని కేఏ పాల్ చెప్పారు. అవినీతి ఉదంతంలో తన అరెస్టు ఖాయమని గ్రహించిన తర్వాతే కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ ఆడిస్తున్నారని, అంశాన్ని పక్కదారి పట్టించేందుకు గవర్నర్ తమిళిసై మీద కేటీఆర్తో మాట్లాడిస్తున్నారని పాల్ ఆరోపించారు.
ఒకప్పుడు తననెంతో గౌరవించిన కేసీఆర్కు ఇప్పుడు మాత్రం కళ్లు నెత్తికి ఎక్కాయని, కేసీఆర్ అక్రమపాలన అంతం చేయడానికే అమెరికా నుంచి వచ్చానని కేఏ పాల్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ కు 30 సీట్లు కూడా రావని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేలా రకరకాల వ్యూహాలు వేస్తున్నారని పాల్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జార్జ్ బుష్, బిల్ క్లింటన్ లాంటి ప్రపంచ నేతలను హైదరాబాద్కు తీసుకు వచ్చిన ఘనత తనదేనని, తెలంగాణలో కేసీఆర్కు ప్రత్యామ్నాయం తానే అని కేఏ పాల్ పేర్కొన్నారు. కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చారని, తాను వైజాగ్ నుంచ్చానని, ఇద్దరం అక్కడ లేము గనుకే ఆంధ్రా ఇప్పుడు అంధకారంలోకి వెళ్లిందని పాల్ వ్యాఖ్యానించారు. ఏపీలో సీఎం జగన్ దారుణంగా ఫెయిలయ్యారని, ఇరవై ఏళ్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏపీ అప్పు తీరదని కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కేంద్రం వర్సెస్ రాష్ట్రం సీన్ నెలకొన్న తరుణంలో గులాబీ బాస్ ను సీబీఐ అరెస్టు చేస్తుందంటూ కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Governor Tamilisai, Ka paul, Telangana, Trs