(G.SrinivasReddy,News18,Khammam)
ఎన్నికలకు మరో 10నెలలు టైముండగానే ఖమ్మం జిల్లాలో బీజేపీ , బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెట్టాయి. జిల్లాకు చెందిన బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) బీఆర్ఎస్(BRS)ను వీడి బిజెపి (BJP)లో చేరుతారు అన్న వార్తల నేపథ్యంలో.. సీఎం కేసీఆర్(KCR) అలర్ట్ అయ్యారు. ఈనెల 18న ఖమ్మం(Khammam)లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టారు. జనంలో విపరీతమైన ప్రాబల్యం ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడితే ఆ పరిణామాలు పార్టీపై పడకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టడానికి సీఎం కేసీఆర్ నడుము కట్టారు. 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్దమైన గులాబీ బాస్ ఈ భారీ బహిరంగసభకు ఢిల్లీ, కేరళ , పంజాబ్ సీఎంలతో పాటు యూపీ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీను కలుపుకొని బీజేపీపై యుద్ధానికి సన్నద్దం అవుతున్నామనే సంకేతం ఇచ్చేందుకే కేసీఆర్ కార్య క్షేత్రానికి ఖమ్మం కేంద్రంగా ఎంచుకోవడానికి బలనిరూపణే అన్నట్లుగా ఉంది.
ఖమ్మంలో కేసీఆర్ స్కెచ్..
టీఆర్ఎస్ను జాతీయ రాజకీయ పార్టీగా ఆవిర్భావించిన తర్వాత ఖమ్మంలో తొలి సభ నిర్వహిస్తోంది తెలంగాణ అధికార పార్టీ. ప్రాంతీయవాదంతో ప్రత్యేక రాష్ట్ర సాధన, రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ నెక్స్ట్ జాతీయ వాదంతో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి బిజెపిపై సమర శంఖం పూరించారు. ఇందుకోసం మొదట్నుంచి తెలంగాణ వాదానికి పెద్దగా చోటు లేని ఖమ్మంను కేంద్రంగా చేసుకొని బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమకు చెందిన సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో సభ నిర్వహిస్తే ప్రాంతీయవాదానికి చోటు లేకుండా ఉంటుందన్న ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే తాను ఆంధ్రప్రదేశ్లోనూ శాఖను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. పక్కనే ఉన్న ఛత్తీస్గడ్ లో కూడా ఆ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేయడానికి చొరవ చూపడం.. ఇంకా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో సైతం టిఆర్ఎస్ రాష్ట్ర శాఖలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
పొంగులేటి పోతే ఏంటీ ..?
ప్రత్యేక తెలంగాణ ముద్ర పెద్దగా పడని ఖమ్మంలో ఈ సభ నిర్వహించడం ద్వారా తాను జాతీయవాదినేనని చాటుకుంటూ.. ప్రత్యేక తెలంగాణ వాదం కేవలం రాష్ట్రం సాధించే వరకు మాత్రమే తన అజెండాలో ఉందని చెప్పడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా పరిపాలన భవనాలను ప్రారంభించిన అనంతరం కెసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నట్లు చెబుతున్నారు. దీని కోసం కొత్త కలెక్టరేట్ పక్కనున్న ప్రదేశంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బహిరంగ సభతో చెక్..
జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలి సభకు ఖమ్మం ఎంచుకోవడంలో మరో ప్రధానమైన కారణం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీగా ఉండి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని.. తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ పార్టీలో ఉండడం ఇక సాధ్యం కాదని నిర్ణయించుకున్న అనంతరం బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన కురుక్షేత్రానికి సిద్ధమని ప్రకటించారు. ఈనెల 18న బిజెపి జాతీయ అగ్ర నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. ఎలాగైనా తెలంగాణలో బాగా వేయాలని ఊబిలోడుతున్న బిజెపికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి ప్రజానాయకుడు దొరకడం ఈ సందర్భంలో ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఆయన్ను నేరుగా జాతీయ అగ్రనాయకత్వం పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఒక మంచి సంకేతం ఇవ్వాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
రెండు పార్టీల మధ్య పోటాపోటీ..
పార్లమెంట్ అభ్యర్ధిగా గతంలో గెలిచిన పొంగులేటి ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళన రూపంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుపొందడం లక్ష్యంగా పొంగులేటి అడుగులు ముందుకేస్తున్నారు. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్రస్థాయిలో ఒక ముఖ్య నాయకునిగా ఫోకస్ చేస్తూ ఆయనకు ప్రధానమైన బాధ్యతలు అప్పగించడం కోసం బిజెపి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధానమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రాబల్యం కలిగిన ఒక ప్రజా నాయకుడిని కేసీఆర్కు దీటుగా బరిలోకి దించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వాలన్న ఆలోచన చేస్తుంది.
తగ్గేదెలే అంటున్న మాజీ ఎంపీ..
బీజేపీ వ్యూహాలను పటాపంచలు చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారితే బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పడానికే కేసీఆర్ బహిరంగసభను ఖమ్మంలో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం సోమవారం మధ్యాహ్నం నుంచి 3గంటల పాటు జిల్లాకు చెందిన నేతలతో సమాలోచనలు జరిపారు. మాజీ ఎంపీ పొంగులేటి పార్టీ వీడిన ఎక్కడ క్యాడర్ సడలకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పొంగులేటి ఎఫెక్ట్ లేకుండా నిరోధించడానికి ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పెడుతున్నట్టు కూడా చెబుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి వెంట తాము వెళ్లి తీరుతామని ఇప్పటికే దాదాపు పది నియోజకవర్గాల్లో ప్రధాన నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఈ భారీ కుదుపును తట్టుకోవడానికే సీఎం కేసీఆర్ ఖమ్మంలో సభ నిర్వహించనున్నట్లు అంచనా వేస్తున్నారు.అయితే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాత్రం మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తాను దొంగతనంగా పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు.ఖమ్మంలోనే రెండున్నర లక్షల మంది సమక్షంలో పార్టీ మారుతానని చేరుతానని చెప్పడం చూస్తుంటే బీజేపీలోకి చేరుతానని కన్ఫర్మేషన్ ఇచ్చినట్లైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Khammam, Ponguleti srinivas reddy, Telangana Politics