తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రస్తుత ముఖ్యమంత్రి, నయానిజాం కేసీఆర్ ను గద్దె దించడానికి బండి సంజయ్ ఒక్కడూ సరిపోతాడని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సంజయ్ ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శనివారం హైదరాబాద్ శివారు తుక్కుగూడ (మహేశ్వరం)లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో నయా నిజాంను గద్దె దింపుదామా? వద్దా? అయితే మీరంతా పిడికిలి బిగించి నాతో ‘భారత్ మాతాకీ జై’ నినాదం చేయండి.. అంటూ పార్టీ కార్యకర్తల్లో షా ఉత్సాహం నింపారు. కేంద్ర మంత్రి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...
‘‘బండి సంజయ్ పాదయాత్రను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఇవాళ్టి సభలో ఆయన ప్రసంగం విన్న తర్వాత అనిపించింది ఏంటంటే.. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడానికి నాలాంటి నేతలు రానవసరమే లేదు.. సంజయ్ సింగిల్ హ్యాండుతో టీఆర్ఎస్ ను కూల్చేస్తాడని స్పష్టమైపోయింది. సంజయ్ పాదయాత్ర ఒక పార్టీకి వ్యతిరేకంగానో, ఒకరిని గద్దెదించాలనో ఉద్దేశించింది కాదు.. కుటుంబ పాలనను అంతం చేయడానికి, రాష్ట్రంలో దళిత, గిరిజనుల కలలు సాకారం కావడానికి ఉద్దేశించింది. ఆ పనిలో భాగంగానే కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ ను పీకి అవతలపారేయబోతున్నాం.
నాడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కారణంగా తెలంగాణ ప్రాంతం.. భరతమాట ఒడిలోకి చేరింది. ఈ సందర్బంగా నేను తెలంగాణ యోధులను స్మరించుకుంటున్నాను. సురవరం ప్రతాపరెడ్డి, దాశరధి రంగాచార్య, పీవీ నరసింహారావులకు నివాళి అర్పిస్తున్నాను. మండుటెండలో బండి సంజయ్ చేసిన పాదయాత్ర నిజంగా అమోఘమైనది. నేను మీ అందరికీ ఒక నంబర్ చెబుతాను.. 6359119119.. ఈ నంబర్ కు మీరు మిస్ కాల్ ఇచ్చినట్లయితే బండి సంజయ్ కి మద్దతు పలికినట్లే.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 4 ఎంపీ సీట్లిచ్చారు. మరో రెండు సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఆ తర్వాత జరిగిన జీఎంఎంసీ ఎన్నికలుగానీ, రెండు ఉప ఎన్నికల్లోగానీ ప్రజలు బీజేపీని ఆశీర్వదించారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్.. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ కేసీఆర్ పూర్తి చేయలేదు. ఒక్కసారి మోదీ సర్కార్ ఇక్కడ వస్తే ఉద్యమ ఫలితాలను సాధించి చూపిస్తాం.
అసలు సెక్రటేరియట్ వైపే వెళ్లని సీఎం కేసీఆర్.. ఎవరో తాంత్రికుడు చెప్పిన మాట విని.. మళ్లీ ప్రభుత్వం రాదేమోననే భయంతో కొత్త సెక్రటేరియట్ కడుతున్నాడు. అయితే ఆయనను గద్దెదించి అవతలపారేసేది తాంత్రికుడి మాటలుకాదు.. తెలంగాణ యువతే అని కేసీఆర్ తెలుసుకోవాలి.
నిరుద్యోగ భృతి ఇస్తానని, రైతుల రుణాలు మాఫీ చేస్తానని, అన్ని జిల్లాలో ఆస్పత్రులు కట్టిస్తానని, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని, దళితులకు 50వేల కోట్ల బడ్జెట్ కేసీఆర్ అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, కనీసం 30 సెంటీమీటర్లు కూడా ఇవ్వలేదు. టీచర్లు, ఇతర నియామకాలకు ఆయన దాదాపు మర్చిపోయారు. హైదరాబాద్ లో ఈ పాటికి నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కావాల్సి ఉంది. అది జరగకపోగా ఉన్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా తయారైంది..
కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడం తప్ప కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు. నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ అంతటి పనికిమాలిన, అవినీతిమయమైన ప్రభుత్వాన్ని చూడలనేలేదు. వీళ్లను పీకి అవతల పారేస్తేగానీ తెలంగాణకు న్యాయం జరగదు. జనం దృష్టిని మరల్చడానికి కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తాడు. ఈ మధ్య కేంద్రం బియ్యం కొనడంలేదంటూ గొడవకు దిగాడు. ఉల్టాపుల్టా మాటలను జనం నమ్మరని కేసీఆర్ తెలుసుకోవాలి. మోదీ వచ్చాకే దేశంలో కనీస మద్దతు ధర పెరిగింది, రైతులకు న్యాయం దక్కుతోంది. మారిన నిబంధనల మేరకు బాయిల్ రైస్ కొనాల్సిన బాద్యత రాష్ట్రాలదే. ఒకవేళ కొనడం చేతకాకపోతే, కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. తర్వాత ఏర్పడబోయే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం భేషుగ్గా బాయిల్ రైస్ కొంటుంది. మీకు కొనే ఉద్దేశం లేక మోదీని బద్నాం చేయడమేంటి?
నిజానికి మోదీ అమలు చేస్తున్న ఎన్నెన్నో పథకాలకు, కేంద్రం నుంచి వస్తోన్న నిధులకు కేసీఆర్, కేటీఆర్ తమ ఫొటోలను అంటించుకుని ప్రజలను మభ్యపెడుతున్నారు. స్కూళ్లను బాగుచేసేందుకు మోదీ సంకల్పిస్తే వీళ్లు నాడు-నేడు అని మార్చుకున్నారు, కేంద్రం తలపెట్టిన హరిత హారం కార్యక్రమాన్ని కేటీఆర్ తనదిగా చెప్పుకుంటున్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మార్చి డబుల్ బెడ్రూమ్ అన్నాడుకానీ ఇళ్లయితే ఇవ్వట్లేదు.
బీజేపీ తన ఐడియాలజీ ప్రకారం పనిచేస్తుంది. కానీ ఇక్కడ నిత్యం బీజేపీ శ్రేణులపై వేధింపులు కొనసాగుతున్నాయి. కేసీఆర్ తెలంగాణను బెంగాల్ గా మార్చాలనుకుంటున్నాడు. అలా కానివ్వబోమని నేను చెబుతున్నా. సాయిగణేశ్ లాంటి ఘటనలు మళ్లీ జరగొద్దని నేను హెచ్చరిస్తున్నా. కేసీఆర్ ఫైవ్ స్టార్ ఫామ్ హౌజ్ లో కూర్చొని పథకాలు రచిస్తున్నాడు.. ముందస్తు ఎన్నికలకు వెళదామనుకుంటున్నాడు. అరే నాయనా.. రేపటికి రేపు ఎన్నికలు పెట్టినా బీజేపీ సత్తా చాటడానికి సిద్దంగా ఉంది.
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగింపును యావత్ దేశం ఆహ్వానించింది. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఏన్నో మేలులు జరుగుతున్నాయి. కానీ కేసీఆర్ కు మాత్రం ఇది ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన జుట్టు మజ్లిస్ పార్టీ చేతిలో ఉంది. ఎంఐఎంకు కేసీఆర్ భయపడతాడేమోగానీ బీజేపీ కాదు. ఉద్యమ సంయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తానని కేసీఆర్ చెప్పాడు. కానీ ఇప్పుడు మజ్లిస్ ఒడిలో కూర్చున్నాడు కాబట్టే ఆ పని చేయడంలేదు. అదే బీజేపీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి భయపడదు. యావత్ దేశానికి అది గర్వకారణమైన రోజు.
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు కదా.. మరి బండి స్టీరింగ్ డ్రైవర్ చేతులోనే కదా ఉండాల్సింది. కానీ టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మాత్రం ఓవైసీ చేతిలో ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఇంకా అప్పులు కావాలంటున్నాడు.. ఎందుకు పిల్లల కడుపులు నింపుకోడానికా? కేసీఆర్ ఎన్నెన్నో కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఇన్నాళ్లూ తాను చేసిన మోసాలను కప్పిపుచ్చాలని కేసీఆర్ చూశాడు. కానీ జనానికి ఇప్పుడు అంతా అర్థమైపోయింది. కేంద్రం చేయాలనుకుంటున్న ప్రతి పనికీ కేసీఆర్ అడ్డం పడుతున్నాడు. అయినా కూడా గత ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ది కోసం రెండున్నర లక్షల కోట్లకుపైగా డబ్బులిచ్చారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడో, బీజేపీ ఏం చేసిందో బండి సంజయ్ తో చర్చకు రావాలని కేసీఆర్ కు సవాలు విసురుతున్నా..’’ అని అమిత్ షా అన్నారు. తుక్కుగూడ సభ ముగిసిన తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు కేంద్ర హోం మంత్రి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bandi sanjay, Bjp, CM KCR, Hyderabad, Telangana, Trs