దమ్ముంటే కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పై పోటీ చేసి గెలవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi sanjay)కు మంత్రి కేటీఆర్ (Minister KTR) సవాల్ విసరడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) మండిపడ్డారు. కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకు? ఒక బీజేపీ సామాన్య కార్యకర్త చాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ను ఈసారి చిత్తుచిత్తుగా ఓడిస్తామని రాజాసింగ్ చెప్పారు. అధికారం, డబ్బు మదం, అహంకారంతో కొట్టుకుంటున్న కేటీఆర్ బలుపును దింపుతామని అన్నారు. 'నీ బలుపును దింపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకో కేటీఆర్' అంటూ రాజాసింగ్ హెచ్చరించారు.
700 కుటుంబాలకు ఏం చెబుతావ్ కేసీఆర్?
గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమయ్యారని రాజాసింగ్ (BJP MLA Raja Singh) మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, కేవలం 80 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెప్పి, అదేదో గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. చనిపోయిన 700 కుటుంబాలకు ఏం చెబుతావ్ కేసీఆర్? అని రాజాసింగ్ (BJP MLA Raja Singh) ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఎన్డీఏ తదితర సంస్థల ద్వారా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తోందని... అయినా కేంద్రంపై కేసీఆర్ విమర్శలు చేయడం ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుందని అన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..?
ఈనెల 17న కరీంనగర్లో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ (Minister KTR) బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ (Challenged to bandi sanjay) విసిరారు. మంత్రి గంగుల కమలాకర్ పై MLA గా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. బండి సంజయ్ పై లక్ష ఓట్ల మెజారిటీతో గంగుల విజయం సాధిస్తారని మంత్రి కేటీఆర్ (Minister KTR) ధీమాను వ్యక్తం చేశారు. మూడేళ్లలో కరీంనగర్ (Karimnagar) కు బండి సంజయ్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా అని ఆయన ప్రశ్నించారు.ముస్లింలంతా దేశ ద్రోహులన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆయన బీజేపీపై మండిపడ్డారు.
‘‘ఎమ్మెల్యే ఎన్నికలయ్యాక మూడు నెలలకు పార్లమెంట్ ఎన్నికలొస్తే మనం లైట్ తీసుకున్నాం. దీంతో.. తంతే బూరెల గంపలో పడ్డట్టు బండి సంజయ్ ఎంపీగా గెలిచాడు. ఆయన నిన్న, ఇవాళ బాగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ను జైలుకు పంపుతానంటున్నాడు. ఎందుకు పంపుతావంటే మాట్లాడడు. చొప్పదండి ఎమ్మెల్యే చేసిన పనులు వరుసపెట్టి వంద చెబుతాడు.. బండి సంజయ్ ఏం చేశాడో చెప్పాలి. బండి సంజయ్ దగ్గర విషయం ఉండదు.. తెల్లారి లేస్తే విషం చిమ్మడం తప్ప. ”అని కేటీఆర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister ktr, Raja Singh, Telangana bjp