తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల (BJP National Executive Meeting) సందర్భంగా సర్కారు కూల్చివేతలపై సంచలన సవాళ్లు వెలువడుతున్నాయి. తాజాగా మహారాష్ట్రతో కలిపి కమలనాథులు ఇప్పటిదాకా 9 ప్రభుత్వాలను కూలదోసిన నేపథ్యంలో తెలంగాణలోనూ అదే పరిస్థితి వస్తుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించగా, తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు జోలికొస్తే తాను ఢిల్లీలో మోదీ సర్కారును కూల్చేస్తానని సీఎం కేసీఆర్ (CM KCR) హెచ్చరించారు. దీనికి సమాధానంగా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay).. కేసీఆర్ కు ప్రతిసవాలు విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే, ఆయనలో పారేది తెలంగాణ నెత్తురే అయితే.. అంటూ నిప్పులు చెరిగారు బండి. వివరాలివే..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వాల కూల్చివేతలపై టీఆర్ఎస్, బీజేపీ ముఖ్యుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు వెల్లువెత్తాయి. మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ టీఆర్ఎస్ సర్కారును కూల్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘మీరు ఎప్పుడా పని చేస్తారా? అని ఎదురు చూస్తున్నా.. మీరు(బీజేపీ) తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొడితే నేను ఫ్రీ అయిపోతా, ఆ తర్వాత మోదీ సర్కారును ఖతం పట్టిస్తా’అని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్.. నీకు దమ్ముంటే.. నీలో ప్రవహించేది తెలంగాణ నెత్తురే అయితే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టు.. అంటూ సంజయ్ చెలరేగిపోయారు..
కేసీఆర్ పాలనలో ఆ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల విచ్చలవిడితనం పెరిగిపోయిందని, శాంతిభద్రతలు దారితప్పాయని, హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, ల్యాండ్, శ్యాండ్, డ్రగ్స్ మాఫియాకు తెలంగాణ అడ్డాగా మారిందని సంజయ్ ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన రాష్ట్రపతి ఎన్నికల వ్యవస్థనే కేసీఆర్ కించపరుస్తున్నారని విమర్శించారు.
‘‘సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లుగా మొరుగుతున్నడు. మోదీ ప్రభుత్వాన్ని పడగొడతడట. కేసీఆర్.. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే, తెలంగాణ కారమే తింటే.. దమ్ముంటే.. మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించు. నీది గింత పార్టీ. ఉఫ్ అని ఊదితే కొట్టుకుపోతవ్. నీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా చేజారొచ్చు. ఉఫ్ మంటే ఊడిపోయే ప్రభుత్వం నీది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజలేమైనా ఓట్లేస్తారా? అవేమైనా సర్పంచ్, మునిసిపల్ ఎన్నికలా? ర్యాలీలు తీస్తూ.. ఫ్లెక్సీలు కడుతూ రాష్ట్రపతి ఎన్నికల స్థాయిని దిగజారుస్తారా?’’ అని బండి మండిపడ్డారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ కంపెనీలకు సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నారని, బీజేపీ మతిలేని విధానాలు, తీరు వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజారిందని, విదేశీ రాజకీయాల్లోనూ మోదీ వేలుపెడుతున్నారని, గడిచిన 8ఏళ్లలో అన్నిటికి అన్నీ తప్పుడు నిర్ణయాలే తీసుకున్న మోదీ దమ్ముంటే తాను చేసిన మంచి పనేదో చెప్పాలని కేసీఆర్ సవాలు విసిరారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్ కు కౌంటరిచ్చే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, BJP National Executive Meeting 2022, CM KCR, Pm modi, Trs