భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీ (KCR National Party) ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా కేసీఆర్ తొలి ఫోకస్ తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైనే ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి క్రమంలో ముందుగా సహచర తెలుగు ప్రజల మద్దతు కూడగట్టుకునేలా కాబోయే బీఆర్ఎస్ అధినేత ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు గల అవకాశాలపై కేసీఆర్ పలువురు ప్రముఖులు, మేధావులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ విస్తరణ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. విభజన ద్వారా తీవ్రంగా నష్టపోయామనే భావనలో ఉన్న ఏపీ ప్రజలను ఎలా మెప్పించాలి? అనే అవకాశాలనూ కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar)ను కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకొని సుదీర్ఘంగా మతనాలు జరిపారు
చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, తెలుగు రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో జరుగుతోన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తనదైన విశ్లేషణలు అందిస్తూ ప్రజల్లోనే ఉంటోన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు పైగా ఇద్దరు నేతల మధ్య అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశంలో జాతీయ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యత, గుణాత్మక మార్పు రావడానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఆవశ్యకతపై సీఎం కేసీఆర్ ఉండవల్లికి వివరించారు.
జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండా, వివిధ రంగాల్లో జరుగాల్సిన అభివృద్ధికి సంబంధించి ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, నాయకులతో చర్చలు జరుపుతున్న సీఎం కేసీఆర్ ఇందులో భాగంగానే ఉండవల్లితో వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు గల అవకాశాలను ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఏం చేయాలన్న ఆలోచనలు తనకు ఉన్నాయో ఉండవల్లికి కేసీఆర్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం.
జాతీయ స్థాయిలో తాను ముందుకు వెళ్లాలని పలు వర్గాల నుంచి సూచనలు వచ్చిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నట్లు సీఎం కేసీఆర్ ఉండవల్లితో అన్నట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఉండవల్లి అభిప్రాయాలను కూడా సీఎం తెలుసుకొన్నారు. వివిధ రంగాల్లో దేశం ఎంతగా వెనుకబడింది.. జాతీయ స్థాయిలో రాజకీయంగా జరుగాల్సిన చర్చ, తాను సిద్ధం చేస్తున్న జాతీయ ఎజెండాలోని పలు అంశాలను ఉండవల్లికి కేసీఆర్ వివరించారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లితో ఫోన్ లో మాట్లాడిన కేసీఆర్.. హైదరాబాద్ వస్తే కలవాల్సిందిగా ఆహ్వానించడంతో ఈ మేరకు ఉండవల్లి ప్రగతిభవన్ వెళ్లారు. కాగా, త్వరలోనే ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CM KCR, Hyderabad, Telangana, Trs, Undavalli Arun Kumar