TS POLITICS AMIT SHAH REPORTEDLY DIRECTING BJP MISSION TELANGANA TO DEFEAT TRS CM KCR IN 2023 ELECTIONS MKS
KCR దూకుడుకు అమిత్ షా కళ్లెం! -ఢిల్లీ నుంచే మిషన్ తెలంగాణ ఆపరేషన్ -రంగంలోకి ఆ 26 మంది?
అమిత్ షా మిషన్ తెలంగాణ
వరి పోరు లాంటి వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తోన్న గులాబీ దళపతికి ఢిల్లీ నుంచే కళ్లెం వేయాలని కమలనాథులు భావిస్తున్నారు.. అమిత్ షా డైరెక్షన్ లో ప్రత్యేక టీమ్ లతో తెలంగాణలో భారీ ఆపరేషన్ చేపట్టారు..
ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండోసారీ తిరుగులేని విజయం సాధించిన బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణేనా? కేసీఆర్ ను నిలువరించేందుకు నేరుగా కేంద్రం పెద్దలే రంగంలోకి దిగారా? వరి పోరు లాంటి వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తోన్న గులాబీ దళపతికి ఢిల్లీ నుంచే కళ్లెం వేయాలని కమలనాథులు భావిస్తున్నారా? అమిత్ షా డైరెక్షన్ లో ప్రత్యేక టీమ్ లతో తెలంగాణలో భారీ ఆపరేషన్ చేపట్టారా? అంటే మీడియా రిపోర్టుల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. యూపీ తర్వాత తమ టార్గెట్ తెలంగాణే అని స్థానిక నేతలు చెబుతున్నట్లుగానే తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత నంబర్2గా, బీజేపీలో అగ్రనేతగా కొనసాగుతోన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రత్యక్ష పర్యవేక్షణలో కమల దళం ‘మిషన్ తెలంగాణ’ అమలుకు చర్యలు మొదలుపెట్టిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నిలబెట్టడమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధమైందని, అజెండాను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మెరికల్లాంటి ఎమ్మెల్యేలను రప్పించినట్లు సమాచారం.
అమిత్ షా నిర్దేశం మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన 26మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపిక చేసి తెలంగాణకు పంపినట్లు తెలుస్తోంది. ఆ 26 మందిలో ఒక్కొక్కరిని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంచార్జీలుగా నియమించారని, 2023 ఎన్నికలు ముగిసేదాకా సదరు నేతలంతా పూర్తిగా తెలంగాణ లో పనిచేస్తారని, పార్టీ ఆలోచనలు, ప్రచార వ్యూహాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమనే అంశాలపైనే వారు పనిచేస్తారని వెల్లడవుతోంది. అంతేకాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఆ 26 మంది నేతలకు తోడు, స్థానిక నేతల్లో టికెట్లు ఆశించకుండా, కేవలం పార్టీ కోసమే పనిచేయాలనుకునే వారి సేవలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే,
తెలంగాణలోని 119 నియోజకవర్గాల వారీగా బీజేపీ నేతల్లో సమన్వయం కోసం.. ఎన్నికల్లో పోటీకి ఆసక్తిలేని, పార్టీ కోసం పనిచేసే సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించనున్నారు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే బీజేపీ తెలంగాణలోనూ రిజర్వుడు స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే 19ఎస్సీ, 12ఎస్టీ నియోజకవర్గాల్లో కార్యా చరణ నిమిత్తం అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు, మాజీ ఎంపీల నేతృత్వంలో 2 ప్రత్యేక సమన్వయ కమిటీలను కూడా రాష్ట్ర పార్టీ నియమించింది. ఇతర రాష్ట్రాల వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా రాగద్వేషాలకు తావులేకుండా ఎన్నికల కార్యచరణను అమలు చేయవచ్చని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
అమిత్ షా తలపెట్టిన మిషన్ తెలంగాణను ఎక్కువ శాతం ఢిల్లీ నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలన్నిటినీ అమిత్ షాకు నేరుగా రిపోర్ట్ చేయాలని అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజల మనోభావాలు, బీజేపీ పట్ల అభిప్రాయాలు, టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎంచుకునే పోరాట రూపాలు తదితర వివరాలన్ని ఎప్పటికప్పుడు నేరుగా అమిత్షాకే నివేదికలు అందించేలా వివిధ బృందాలు పనిచేస్తున్నాయి. పలు అంశాలపై సర్వేల ద్వారానూ గ్రౌండ్ లెవల్ ఇన్ఫోను అమిత్షా కార్యాలయానికి చేరవేస్తున్నట్లు వెల్లడైంది.
తెలంగాణలో ఉగాది తర్వాత బీజేపీలోకి చేరికలు పెరగనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల దరిమిలా బీజేపీపై తెలంగాణ నేతల్లో నమ్మకం పెరిగిందని, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమయ్యారని, ముహుర్తాలు లేని కారణంగా వాయిదాపడుతూ వస్తోన్న చేరికలు ఉగాది తర్వాత ఊపందుకుంటాయని తెలుస్తోంది. వీలును బట్టి అమిత్ షా నేరుగా తెలంగాణలోనూ పర్యటిస్తారని సమాచారం.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.