దేశంలో అత్యధికంగా మద్యం అమ్ముడయ్యే రాష్ట్రాల జాబితాలో అగ్రభాగాన ఉన్న తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు లిక్కర్ అమ్మకాలే ఆయువుపట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో సీఎం కేసీఆర్ సూచనల మేరకే రాష్ట్రం నలుమూలలా ఊరూవాడలా వైన్ షాపులు, వాటికి అనుబంధంగా బెట్లు షాపులు ఏర్పాటైనట్లు ఆరోపణలున్నాయి. బెల్టు షాపులు, మద్యం అక్రమపారుదలను పోలీసులు చూసిచూడకుండా వదిలేయడాన్ని బట్టి ఇది ప్రభుత్వ పాలసీనే అని అవగతం అవుతున్నట్లూ విపక్ష నేతలు విమర్శిస్తారు.
కారణాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఏటేటా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మద్యం కారణంగానే నేరాలూ విచ్చలవిడిగా పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని అమలు చేస్తామంటూ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మారిందనీ వ్యాఖ్యానించారు. వివరాలివే..
బంగారు తెలంగాణగా మార్చుతానంటూ గద్దెనెక్కిన కేసీఆర్ చివరికి రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చేశారని కాంగ్రెస్ నేత వీహెచ్ మండిపడ్డారు. తెలంగాణలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు పెరగడానికి కారణం కేసీఆరే అని, ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా లిక్కర్ అమ్మడం వల్లే రాష్ట్రంలో దారుణాలు, నేరాలు పెరిగాయని వీహెచ్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మద్యం పాలసీపై, మద్యానికి వ్యతిరేకంగా తాను చేయబోయే పోరాటంపై కీలక ప్రకటనలు చేశారు.
తెలంగాణలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని ప్రజలను తాగుబోతులను చేసి.. కేసీఆర్ సొమ్ము చేసుకుంటున్నాడని వీహెచ్ మండిపడ్డారు. పర్మిట్ రూమ్లంటూ ఒకే బస్తీలో మూడు, నాలుగు బార్, వైన్ షాపులు తెరిచారన్నారు. ప్రభుత్వం విస్కీ, వైన్ అమ్మకాలతోనే నడుస్తోందని విమర్శించారు.
తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వంపై తిరగబడేందుకు మహిళలు రోడ్డు మీదకు రావాలని కాంగ్రెస్ నేత వీహెచ్ పిలుపునిచ్చారు. మహిళల తరఫున మద్యానికి వ్యతిరేకంగా తాను పోరాడుతానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని, ఆ మేరకు రాహుల్ గాంధీ, రేవంత్తో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని వీహెచ్ తెలిపారు.
మద్యం అమ్మకాలు రోజురోజుకూ ఊపందుకుంటుండగా కాంగ్రెస్ అధకారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలుకు యత్నిస్తామన్న కాంగ్రెస్ నేత వీహెచ్ మాటలు కలకలం రేపాయి. పీసీసీ రేవంత్ రెడ్డి ఇందుకు అనుకూలంగా ఉన్నారా, మద్య నిషేధం కాంగ్రెస్ విధానమా? దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. తెలంగాణలో గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే ఈ సమ్మర్ సీజన్ లో బీర్ల అమ్మకాలు ఏకంగా 90 శాతం, బ్రాందీ, విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు 3 శాతం పెరినట్లు ఆబ్కారీ శాఖ తాజా గణాకంకాల్లో వెల్లడైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Liquor ban, Liquor sales, Telangana, Trs, V Hanumantha Rao