(K.Lenin,News18,Adilabad)
తెలంగాణ(Telangana)లో అమలవుతున్న పథకాలు బాగున్నాయి. మా ప్రాంతాలను కూడా తెలంగాణలో కలపండి అంటూ గత కొద్ది రోజుల క్రితం తెలంగాణకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర(Maharashtra)లోని ధర్మబాద్(Dharmabad)ప్రాంతానికి చెందిన కొన్ని పల్లెలు ఉద్యమించాయి. కాని ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. తెలంగాణలో కంటే మహారాష్ట్రలోనే రైతులు ఎక్కువ లబ్ది పొందుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చారు ఆదిలాబాద్(Adilabad)జిల్లాకు చెందిన ప్రజలు. ఈ మేరకు రైతులు ఉద్యమాన్ని కూడా లేవనెత్తారు. ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని కూడా అందజేశారు.
మమ్మల్ని కర్నాటకు పంపండి..
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కొత్త ఉద్యమం పురుడు పోసుకుంటోందా..? పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేసి పార్టీని విస్తరింపజేయాలని చూస్తున్న రాష్ట్ర అధికార పార్టీకే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఝలక్ ఇస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాలోని తలమడుగు మండల కేంద్రంలో జరిగిన సంఘటన సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ ఎస్ పార్టీ బిఆర్ ఎస్ గా ఆవిర్భవించి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. పార్టీ విస్తరణపై దృష్టి సారించిన అధినేత పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ లో తొలి బహిరంగ సభను నిర్వహించి తాము అమలు చేస్తున్న పథకాలను చెప్పుకొచ్చారు. అంతలోనే ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు రైతులు, గ్రామస్థులు.
వాళ్ల పథకాలైన ఇవ్వండి..
ఇక్కడి రైతులకు రైతు బంధు పథకం ద్వారా అందుతున్న లబ్ది తప్ప మరే లాభం చేకూరడం లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలో అమలవుతున్న పథకాలు తెలంగాణలో లేవని, రైతులు పంట నష్టపోతే ఎకరానికి 13 వేల రూపాయలు అక్కడి ప్రభుత్వం చెల్లిస్తోందని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారని, వ్యవసాయ భూముల్లో బోరు బావులకు సోలార్ పంపులను రాయితీపై ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు ఇక్కడి రైతులు. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లు లక్ష రూపాయల రుణమాఫీ కాలేదని, పంటల బీమా అమలు చేయడం లేదని వాపోతున్నారు.
మన కంటే అక్కడే బెటర్...
అంతే కాదు ఇంకా కౌలు రైతు చట్టం తీసుకురావాలని, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలని తహసీల్దార్ కు అందజేసిన వినతిపత్రంలో రైతులు కోరారు. మహారాష్ట్ర తరహా పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలని, లేదంటే తమ మండలాన్ని మహారాష్ట్రలో కలపాలని కోరుతూ తలమడుగు రైతులు, స్థానికులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేయడం ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తెరపైకి తెచ్చిన కొత్త డిమాండ్ అయితే మహరాష్ట్రలోని పథకాల్ని అమలు చేయాలి లేదంటే ఆ రాష్ట్రంలో తమను కలపాలని లేదంటే వారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టేందుకు సిద్దమని స్పష్టం చేశారు.
సీన్ రివర్స్ ..
గతంలో తెలంగాణ సరిహద్దున మహారాష్ట్రలో ఉన్న ప్రాంతాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్లు వస్తే, ఇపుడు అందుకు రివర్స్లో తెలంగాణలోని మండలాలను మహారాష్ట్రలో కలపాలనే సరికొత్త డిమాండ్ను ప్రజలు లేవనెత్తడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దేశ వ్యాప్తంగా పాగా వేయలాని చూస్తున్న తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్కు ఇదో కొత్త తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Telangana Politics