భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనున్న వేళ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) (TRS) అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) భారీ షాకిచ్చింది. వివాదాస్పదంగా మారిన ‘టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు భూముల కేటాయింపు’ వ్యవహారంలో సీఎం సహా ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు స్వీకరించిన నాలుగురోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం అనూహ్య చర్చకు దారి తీసింది. వివరాలివే..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్.. దేశరాజధాని ఢిల్లీతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలు, పాత జిల్లాలో కొన్నిచోట్ల పార్టీ కార్యాలయాలను భారీ హంగులతో నిర్మించడం తెలిసిందే. చాలా వరకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లోనే పార్టీ టీఆర్ఎస్ ఆఫీసుల నిర్మాణాలు జరిగాయి. అయితే, సొంత పార్టీకి భూముల కేటాయింపులో కేసీఆర్ సర్కారు కనీస నిబంధనలను పాటించలేదని, అత్యంత ఖరీదైన భూములను అప్పనంగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై..
హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతం బంజారా హిల్స్ తోపాటు జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు తక్కువ ధరకే ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ రాజ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం నాడు విచారణ చ చేపట్టింది. బంజారా హిల్స్ లో టీఆర్ఎస్ ఆఫీసు కోసం 4,935 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని, అత్యంత ఖరీదైన ఈ భూమిని గజం కేవలం రూ.100కే కేటాయించడం ఆక్షేపణీయమని, ఇదే తంతు అన్ని జిల్లాల్లో జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు తక్కువ ధరకే భూముల కేటాయింపు వ్యవహారంలో పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన విభాగం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ లకు నోటీసులు జారీ చేసింది. ఖరీదైన భూములను తక్కువ ధరకే కేటాయించడంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
నిజానికి నాన్ కమర్షియల్, ప్రజాసేవ కోటాలో రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలు భూములకు కేటాయించడం గతంలోనూ ఉండేది. అయితే పలు నిబంధనలు, కనీస మాత్రపు ధర పరిశీలనాంశాలుగా ఉండేవి. టీఆర్ఎస్ ఆఫీసుల కోసం పెద్ద పరిమాణంలో స్థలాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు తొలి నుంచీ ఉన్నాయి. కాగా, తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే సీఎంను ఇరాకాటంలో పెట్టే ఇలాంటి కేసులో ఆదేశాలు వెలువడటం చర్చకు దారి తీసింది. హైకోర్టు నోటీసులపై సీఎం, టీఆర్ఎస్, అధికారులు స్పందించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Telangana High Court, Trs