స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ దేశం చీకట్లో కునారిల్లడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని, ఆ రెండు పార్టీలకు జాతీయ స్థాయిలో విజన్ లేకపోవడమే దుస్థితికి దారితీసిందని తరచూ ఆరోపించే తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఇటీవలే తాను జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా రూపొందిస్తున్నట్లు ప్రకటన చేయడం తెలిసిందే. దేశానికి సరికొత్త దిశ, దశ చూపేలా టీఆర్ఎస్ ప్రత్యామ్నాయ అజెండా తీసుకొస్తుందని, జాతి పునర్నిర్మాణానికి కేసీఆర్ అంకితమవుతాడనీ ఉద్ఘాటించిన విధంగానే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. (TS CM KCR Nationwide Tour)
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి నుంచి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో వారానికిపైగా సాగనున్న పర్యటనల్లో మొత్తం 8 రాష్ట్రాలు ప్రభావితం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించారు. బీజేపీ బీ-టీమ్ అనే ముద్రను చెరుపుకోలేక, మోదీ సర్కారుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తోన్న పోరాటాన్ని కనీసం ప్రతిపక్షాలు సైతం గుర్తించకున్నా కేసీఆర్ మాత్రం పట్టువీడకుండా ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. వివరాలివే..
‘దేశం కోసం, దేశ ప్రగతి కోసం ప్రజలకు ఒక కొత్త ఎజెండాను సెట్ చేయడానికి నేను ఒక సైనికుడిగా పనిచేస్తాను. కొత్త పంథాలో పురోగమించాలి. ఇందుకోసం తీసుకురావాల్సిన నిర్మాణాత్మక మార్పులు, విధానాలపై కసరత్తు చేస్తాం’ అంటూ ఇటీవల హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్లీనరీలో చెప్పిన విధంగానే సీఎం కేసీఆర్ ముందడుగు వేశారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలతో, ప్రముఖ ఆర్థిక వేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. దేశ రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై వారితో చర్చించనున్నారు. అలాగే జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతోనూ ఆయన భేటీ కానున్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన కాలంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, చైనాతో సరిహద్దు పోరులో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడం కూడా కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో ముఖ్యాంశంగా ఉన్నాయి. తొలి దశ పర్యటనలో మొత్తం 8 రాష్ట్రాలకు సంబంధించి కేసీఆర్ కార్యకలాపాలు ఉంటాయి. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం ద్వారా కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన మొదలవుతుంది. రాబోయే రోజుల్లో ఆయన ఏమేం చేయబోతున్నారో, పర్యటన వివరాలివే..
తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. వివిధ రాజకీయపార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో భేటీ అవుతారు. 22 వ తేదీన కేసీఆర్ ఛండీగఢ్కు వెళ్లి.. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన సుమారు 600 రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెకులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్తో కలిసి చేపడతారు. సుమారు 4 రోజులపాటు సీఎం కేసీఆర్ చండీగఢ్లో గడుపుతారు.
ఛండీగఢ్ క్యాంప్ నుంచి సీఎం కేసీఆర్ ఈనె 26న కర్ణాటక వెళతారు. బెంగళూరు సిటీలో పర్యటిస్తారు. జేడీఎస్ ముఖ్యనేతలైన మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశమవుతారు. రాత్రికి బెంగళూరులోనే బస చేసి, 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్తారు. అక్కడ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకొని.. తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు. మళ్లీ గంటల వ్యవధిలోనే, అంటే, మే 29 లేదా 30వ తేదీన.. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్ సంసిద్ధం కానున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో అమరజవాన్ల కుటుంబాలను ఆదుకోనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.