TRS MLC KALVAKUNTLA KAVITHA COMMENTS ON BJP AND URGE VOTERS TO VOTE FOR CAR MS BK
GHMC Elections: అభివృద్ధి గురించి ఐదు నిమిషాలైనా మాట్లాడగలరా..? బీజేపీకి కవిత సవాల్
కల్వకుంట్ల కవిత(ఫైల్ ఫోటో)
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ నాయకుల మధ్య సవాళ్ల పర్వం ఎక్కువవుతున్నది. మత రాజకీయాలు చేసే బీజేపీ.. అభివృద్ధి గురించి ఐదు నిమిషాలైనా మాట్లాడగలరా..? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కమలం నేతలకు సవాల్ విసిరారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లో రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామేనని టీఆర్ఎస్ చెప్పుకుంటుండగా.. తాము అధికారంలోకి వస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెబుతున్నది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. మత రాజకీయాలు కాకుండా, బీజేపీ చేసిన అభివృద్ధి గురించి ఐదు నిమిషాలు మాట్లాడాలని ఆమె బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, గాంధీ నగర్ డివిజన్ లోని పలు అపార్ట్మెంట్ లలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. కరోనా వచ్చినా, వరదలు వచ్చినా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదన్న ఎమ్మెల్సీ కవిత, ప్రతి క్షణం ప్రజల పక్షాన నిలిచేది టీఆర్ఎస్ పార్టీయేనన్నారు.
24 గంటల కరెంటు, పరిశ్రమలకు సింగిల్ విండో పర్మిషన్స్,పేద బాలింతలకు ఆర్థిక సహాయం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. వరద వచ్చినా, కరోనా వచ్చినా రాష్ట్రానికి ఒక్క పైసా సాయం చేయని బీజేపీ నేతలు.. మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.గాంధీ నగర్ డివిజన్ లో గత ఆరేండ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ గోపాల్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.