టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను తమ ఊరిలోకి రావద్దంటూ ఢీకంపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాలు.. నిజమాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామలో పెద్దమ్మతల్లి విగ్రహం రెండు రోజుల క్రితం అపహరణకు గురైంది. చోరీకి గురైన విగ్రహం బాసరలో దొరికింది. ఈ క్రమంలోనే ఢీకంపల్లి గ్రామంలోని ఆలయాన్ని పరిశీలించడానికి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి అక్కడికి వెళ్లారు. అయితే జీవన్రెడ్డితో ఢీకంపల్లి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. వెంటనే పెద్దమ్మతల్లి విగ్రహాన్ని తీసుకొని వచ్చి గ్రామంలో ప్రతిష్టించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసేంతవరకు ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
విగ్రహం లభ్యమైందని, వీలైనంత తొందరగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపడతామని అన్నారు. అయితే ఎమ్మెల్యే ఎంతా చెప్పినా గ్రామస్తులు వినిపించుకోలేదు. ఈ ఘటనను కొందరు స్థానిక యువకులు వీడియో తీస్తుండగా పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విగ్రహాన్ని అపహరించిన నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇక, గ్రామస్తులు ఆందోళన జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, గంగారెడ్డి అక్కడే ఉన్నారు. దీంతో వారే గ్రామస్తులను రెచ్చగొట్టారని ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jeevan reddy, Nizamabad