తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా సాగుతోన్న వివాదాస్పద ధోరణి తారా స్థాయికి చేరింది. వరుస ఢిల్లీ పర్యటనల్లో కేంద్రం పెద్దలను కలుస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను, యంత్రాంగాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా, ఆమెకు కౌంటరిచ్చే క్రమంలో టీఆర్ఎస్ మంత్రులు సైతం గీతదాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కొందరు మంత్రులు వ్యక్తిగత దూషణలకూ దిగుతున్నారని గవర్నర్ వాపోతుండగా, నిజానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది ఆమెనంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ మాట్లాడిన ప్రతిమాటకూ కౌంటర్ ఇస్తున్నట్లుగా మంత్రి తలసాని బుదవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తమిళిసై తీరును తీవ్రంగా ఆక్షేపించారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రెస్మీట్లు పెట్టిమరీ కేసీఆర్ సర్కారును నిందించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తమను ఎన్నుకున్నారని.. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రితో పనిచేయడం ఇష్టంలేదని చెప్పడం గవర్నర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. గవర్నర్గా ఆమె బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని తలసాని హితవు పలికారు.
‘రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడే పనిచేయాలి. కానీ గవర్నర్ మీడియాతో అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గవర్నర్ తన బాధ్యతను వదిలిపెట్టి రాజకీయపార్టీ నాయకురాలిగా మాట్లాడటం బాధాకరం. మహిళగా ఆమెను ఎంత గౌరవించాలో అంత గౌరవించారు. కానీ అనవసర గిల్లికజ్జాలు పెట్టుకోవడం సరికాదు’అని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, మంగళవారం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ సర్కారుపై సంచలన విమర్శలు చేశారు. తాను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానని టీఆర్ఎస్ నేతలు విమర్శించాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో నేను బీజేపీకి చెందిన వ్యక్తినే. దాన్ని ఎవరూ కాదనలేదు. అది నా చరిత్ర. కానీ, ఇప్పుడు కూడా అలాగే ఉంటాననుకుంటే ఎలా? కాంగ్రెస్ నేతను టీఆర్ఎస్లో చేర్చుకొని తక్షణమే అతడ్ని ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. మరి అతన్ని కాంగ్రెస్ వ్యక్తిగా ఎందుకు భావించడం లేదు..? అతనిపై ఉన్న నమ్మకం ఇతరుల మీద ఎందుకు లేదు?’అని పరోక్షంగా కేసీఆర్ కు సెటైర్ వేశారు.
గవర్నర్, సీఎం వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలన్న తమిళిసై.. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులం కాబట్టి సుపీరియర్ అని.. గవర్నర్ను కేంద్రం నియమిస్తుంది కాబట్టి సుపీరియర్ కాదని (టీఆర్ఎస్ నేతలు) అనుకోవడం సరికాదని సూచించారు. అసలు ఎమ్మెల్యేలు మంచి చేస్తే జనం గవర్నర్ను ఎందుకు ఆశ్రయిస్తున్నారనీ తమిళిసై ప్రశ్నించారు. నిన్నటి గవర్నర్ ప్రెస్ మీట్ కు కౌంటర్ గా ఇవాళ మంత్రి తలసాని నిర్వహించిన ప్రెస్ మీట్ రెండు వ్యవస్థల మధ్య అగాధాన్ని మరింత పెంచేలా ఉందనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Governor Tamilisai, Minister talasani srinivas, Talasani Srinivas Yadav, Telangana, Trs