తెలంగాణ ఉద్యమకారుడు, ఒకప్పటి ఉద్యోగ సంఘాల నాయకుడు, ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనూహ్య వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ మంత్రి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తగా, వాటిని నిర్ధారించుకున్న ఎన్నికల సంఘం గౌడ్ పై తీవ్ర చర్యలకు సమాయత్తం అవుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. శ్రీనివాస్ గౌడ్ ఈసీ వివాదంపై ఈ మేరకు ‘సాక్షి’ మీడియా కీలక కథనాన్ని ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం..
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్ గౌడ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తేలింది. అయితే లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్ను వెబ్సైట్ నుంచి తొలగించారని తేలింది. మళ్లీ సవరించిన అఫిడవిట్ను నెలన్నర తర్వాత అప్లోడ్ చేసినట్లు ఆరోపణ వచ్చింది.
కాగా, స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్సైట్ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎలక్షన్ కమిషన్ నివేదిక తెప్పించుకుంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్ గోయల్ బదీలీపై వెళ్లారు. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది.
గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ట్యాంపరింగ్ను టెక్నికల్ బృందం ధృవీకరిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం కనిపిస్తోందని కథనంలో పేర్కొన్నారు. అదే జరిగితే శ్రీనివాస్ గౌడ్ మంత్రి, ఎమ్మెల్యే పదవి కోల్పోవడమేకాదు శిక్షకు కూడా అర్హులయ్యే అవకాశం ఉంది. ఈ కథనాలపై మంత్రిగానీ, అధికార టీఆర్ఎస్ గానీ స్పందించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.