బీజేపీని బంగాళాఖాతంలో కలుపేదాకా నిద్రపోనని, కేంద్రంలోని మోదీ సర్కారును కూలదోస్తామని శపథాలు చేసిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ దిశగా పోరును ఉధృతం చేశారు. ఈనెల 27న జరుగబోయే టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం వేదిక నుంచి కేసీఆర్ తదుపరి యుద్ద ప్రణాళిక వెలువరించనున్నారు. కాగా, నేరుగా ప్రధాని మోదీనే ఢీకొట్టేలా టీఆర్ఎస్ కార్యాచరణ ఉండబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాటల్లో వెల్లడైంది. టీఆర్ఎస్ పుట్టినరోజు పండుగ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, బీజేపీని ఉద్దేశించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కేంద్రానికి ఇచ్చామని, అతి త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలు పలువురు పదేపదే చెబుతున్న క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన రీతిలో కౌంటరిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిని, బీజేపీలో చేరిన నేతలపై కేసుల ఊసు లేకపోవడాన్ని, గవర్నర్ తమిళిసై రాజకీయ నేపథ్యం, టీఆర్ఎస్ సర్కారును పడగొడతానన్న వ్యాఖ్యలు, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి జరగబోయే పరాభవం ఇదేనంటూ మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూలో ఘాటు కామెంట్లు చేశారు. మోదీని జైలుకు పంపుతామంటే జైల్లో పెడతారా? అని సవాలు చేశారు.
విపక్ష పార్టీలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దాడులు, తెలంగాణలో అవినీతిపై బీజేపీ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. ‘ఎలాంటి ఆధారాలు లేకుండా విపక్షాలు సొల్లు పురాణం చెబుతున్నాయి. కేంద్రంలో జరుగుతున్నదేంటి? దేశవ్యాప్తంగా మోదీ-ఈడీ, జుమ్లా-హమ్లా తప్ప మరో మాటే వినిపించడంలేదు. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ అవినీతి లేదా? వాళ్లంతా సత్యహరిశ్చద్రులా? కేసులు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వాళ్లు బీజేపీలో చేరగానే కేసుల ఊసు లేకుండా పోతుంది. టీబీజేపీ బండి సంజయ్ చీటికిమాటికి సీఎం కేసీఆర్ ను జైలులో పెడతామంటున్నారు. మేం కూడా మోదీని జైలులో పెడతామని అనవచ్చు. మోదీపై విమర్శలు చేశారని గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. మోదీ చెప్పేవి గాంధీ సిద్దాంతాలు.. ఆచరించేవి గాడ్సే సిద్ధాంతాలని నేనూ అంటున్నాను. మరి నన్ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపుతారా?’అని కేటీఆర్ సవాలు విసిరారు. అవినీతి బీజేపీ నేతలను జైలుకు పంపుతామని సీఎం కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో హెచ్చరించడం తెలిసిందే.
కేసీఆర్ సర్కారుకు, గవర్నర్ వ్యవస్థకు మధ్య విభేదాల అంశంపైనా కేటీఆర్ స్పందించారు. మోదీ గతంలో చెప్పిన మాటలను గుర్తుచేస్తూ బీజేపీపై ఎదురుదాడి చేశారు. ‘రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర చాలా చిన్నది. రాష్ట్రానికి రాజ్యాంగం తరఫున అధిపతి. అది నామినేటెడ్ పోస్టు. ఎవరిని నియమిస్తే వారు వచ్చి పని చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కీలకం. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేని వారే గవర్నర్లుగా ఉండాలని, సర్కారియా కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తీరా ఆయన ప్రధాని అయ్యాక చేస్తున్నదేంటి? తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిని తెలంగాణ గవర్నర్ గా వేశారు. ఆమెకు రాజకీయ వాసనలు ఇంకా పోలేదు. గవర్నర్ ను అన్ని విధాలుగా గౌరవించాం. కానీ గౌరవమర్యాదలు పరస్పరం ఉండాలి. తనను తాను గొప్పగా ఊహించుకొని, ప్రజల చేత ఎన్నికైన ప్రభఉత్వాన్ని పడగొడతానని, ఫైలు ఆపితే 15 రోజుల్లో ప్రభుత్వం పడిపోయేదని గవర్నర్ చెప్పడమేంటి?’అని కేటీఆర్ ప్రశ్నించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోయేది టీఆర్ఎస్ పార్టీనే అని, కేసీఆర్ పట్ల ప్రజలకు గొప్ప ఆదరణ ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. బీజేపీది వట్టి వాపు మాత్రమేనని, దానిని బలుపు అనుకోవద్దని, టీవీలు, సోషల్ మీడియాలో అరుపులు, కేకలు, హడావిడిని నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 100 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జోస్యం చెప్పారు. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యర్థులేకాదని, అయితేగియితే ప్రత్యర్థిగా ఎంఐఎం పార్టీనే కావొచ్చుని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Governor Tamilisai, KTR, Minister ktr, Telangana, Trs