కొత్త అప్పులకు కేంద్రం, ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి జఠిలంగా మారిన దరిమిలా ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేసీఆర్ సర్కారు పన్నులు పెంచుతున్నది. తెలంగాణ ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పులు చేసిందని, కొత్త అప్పులకు అనుమతించేది లేదని కేంద్రం తేల్చిచెప్పడం, రుణ సమీకరణకు అనుమతి నిరాకరించడంతో రాష్ట్రంలో సాధారణ రెవెన్యూ పాలనతోపాటు ప్రాజెక్టులు, పథకాలు, జీతాల చెల్లింపులకు ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతుండటం తెలిసిందే. అప్పులకు అనుమతి కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ దాదాపు విఫలయం కావడంతో మరో దారి లేక రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంపు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, గుట్టుచప్పుడుకాకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా పన్నులు పెంచడం విమర్శలకు తావిచ్చినట్లయింది. (Telangana Govt Increased Tax On Transport And Commercial Vehicles) వివరాలివే..
అప్పులపై కేంద్రం ఆంక్షల నేపథ్యంలో తెలంగాణలో వాహనాలపై పన్నులను పెంచేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ట్రాన్స్ పోర్ట్, కమర్షియల్ వాహనాలపై ట్యాక్సును భారీగా పెంచేసింది. ఈ మేరకు రవాణా శాఖ గుట్టుచప్పుడు కాకుండా పెంపుదలను అమల్లోకి తీసుకొచ్చింది. పెట్రో ధరల భారానికితోడు వాణిజ్య వాహనాలు మూడు నెలలకు ఒక సారి చెల్లించే పన్నులు ఇక తడిసిమోపెడు కానున్నాయి. స్కూల్ పిల్లల బస్సులు, సరుకులు రవాణా చేసే లారీలు, ట్యాక్సీలు, క్యాబ్ లు ఇలా అన్ని ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు పన్నుల పెంపు వర్తించనుంది.
కనీస సమాచారం కూడా లేకుండా కేసీఆర్ సర్కారు పన్నులు పెంచేయడంతో.. గడువు మేరకు పన్ను చెల్లించేందుకు ఆన్ లైన్, మీ సేవా కేంద్రాల్లో ప్రయత్నించగా పన్నులు పెరిగినట్లు చూపిస్తుండటంతో వాహనదారులు కంగుతింటున్నారు. ఈ మధ్యే వాహనాల జీవితకాల పన్ను మొత్తాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం ఇప్పుడు వాణిజ్య వాహనాల పన్నును సైతం పెంచింది. కాగా, క్షేత్ర స్థాయి అధికారులకే కాదు వాహనదారులకూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం పన్నులు పెంచడంపై విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణలో సుమారు 5.70 లక్షల ట్రాన్స్ పోర్ట్ వాహనాలున్నాయి. క్యాబ్ లు, మ్యాక్సీ క్యాబ్ లు మరో 1.4లక్షల వరకు ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీల బస్సులు మరో 27 వేలు ఉన్నాయి. వీటితోపాటు ప్రయాణికులను చేరవేసే బస్సులు, వివిధ అవసరాలకు వినియోగించే ట్యాంకర్లపైనా పన్ను భారం పడనుంది. కొన్నింటిపై పన్నుల పెంపు 20 శాతం వరకు ఉండగా, మరికొన్నింటిపై అంతకుమించే పెరిగినట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఒడిశాలతో పోల్చితే వాహనాలపై పన్నులు తెలంగాణలోనే ఎక్కువ. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకపోగా ఇప్పుడు రవాణా శాఖ వాహనాలపై పన్నులు పెంచడం గమనార్హం.
స్కూల్ పిల్లలు ప్రయాణించే మినీ బస్సులపై గతంలో రూ.775గా ఉన్న పన్ను ఇప్పుడు రూ.910కి పెరిగింది. పెద్ద బస్సులపై పన్ను రూ.1396 నుంచి రూ.1750కి పెరిగింది. ఆలిండియా పర్మిట్ తీసుకున్న బస్సులోని ప్రతి సీటుకు గతంలో రూ.3675గా ఉన్న మొత్తాన్ని రూ.4000కు పెంచారు. రాష్ట్రంలో తిరిగే బస్సులోని ప్రతి సీటుకు పన్ను గతంలో రూ.2625కాగా ఇప్పుడు దాన్ని రూ.4000కు పెంచారు. ఈ పెంపు భారం నేరుగా ప్రయాణికులపైనే పడుతుందని ప్రైవేటు ట్రావెల్స్ వారు అంటున్నారు. ఏపీతో పోల్చితే ఆల్ ఇండియా పర్మిట్ బస్సుల సంఖ్య తెలంగాణలో తక్కువేనని, ఇక్కడ రిజిస్ట్రేషన్లు పెరిగేలా చేయాల్సింది పోయి, పన్నులు పెంచడంతో పరిణామాలు మారొచ్చని రవాణా రంగంలోని వారు అభిప్రాయపడుతున్నారు.
కరోనా విలయం తర్వాత సరుకు రవాణా వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, వాహనాలపై ఈఎంఐలు, ఫైనాన్సులు కట్టలేక లారీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం పన్నులు పెంచడం దారుణమని, లక్షల మంది ఉపాధి పొందే రవాణా రంగంలో పరిస్థితి దయనీయంగా మారుతోందని లారీ యజమానుల సంఘాలు విమర్శిస్తున్నాయి. కాగా, ప్రస్తుతానికి రావాణా శాఖలో చోటుచేసుకున్న పన్నుల పెంపు రాబోయే రోజుల్లో కమర్షియల్ టాక్స్, మున్సిపాలిటీలు, పంచాయితీ రాజ్ విభాగాల్లోనూ ఉంటుందనే అంచనాలున్నాయి. కాగా, పన్నుల పెంపు అప్పుల సంక్షోభం వల్లేనా, మరే ఇతర కారణాల వల్లా? అనేది ప్రభుత్వం నుంచి వివరణ రావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Taxes, Telangana, Telangana transport