తెలంగాణకు డైనమిక్ మంత్రిగా పేరుపొందిన సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు తాజాగా అనూహ్య ప్రశంస దక్కింది. 20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రముఖ అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ కితాబిచ్చారు..
ఇండియాలో యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణకు డైనమిక్ మంత్రిగా పేరుపొందిన సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు తాజాగా అనూహ్య ప్రశంస దక్కింది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నేతలతోనూ సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, భారతీయ అమెరికన్ ఆశా జడేజా మోత్వానీ మంత్రి కేటీఆర్ తో భేటీ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు. 20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంటూ ట్వీట్ చేశారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
20 years from now, don’t be surprised if KTR becomes PM of India. I have never seen a young politician with such clarity of vision and expression. Telangana team is on fire in Davos. They remind me of a silicon valley start up - will likely go back w $billions in future deals. pic.twitter.com/ae1rT8jXwy
— Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) May 23, 2022
దావోస్లో మంత్రి కేటీఆర్ బృందం.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా వివరిస్తూ దూసుకెళ్తుందన్నారు. కేటీఆర్ తెలంగాణకు బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారని, తనకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆశా పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్తో పాటు ఆయన బృందం కలిసి తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో అద్భుతమైన జాబ్ చేస్తుందని ఆశా జడేజా కొనియాడారు. ఇదిలా ఉంటే,
దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్.. ఏపీ మంత్రి వైఎస్ జగన్ ను కలవడం తెలిసిందే. తాజాగా ఆయన ఇషా ఫౌండేషన్ సదర్గురుతోనూ భేటీ అయ్యారు. తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ సాయిల్’ పేరుతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దావోస్లో ఆయన రెండు రోజులపాటు ప్రపంచస్థాయి కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులోభాగంగా అత్యంత కీలకమైన ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ కంపెనీలతో సమావేశమైన సద్గురు.. మంగళవారం మంత్రి కేటీఆర్తో దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో సంభాషించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.