తెలంగాణ ఆర్థిక సంక్షోభం అంచుల్లో నిలిచిందా? ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి వెళ్లారంటూ కొత్త అప్పులపై కేంద్రం, ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందా? కొత్త అప్పులు పుట్టని కారణంగా ఉద్యోగులకు వేతనాలు, సంక్షేమ పథకాలకు సరిపడా డబ్బులు లేవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్రం, ఆర్బీఐ ఆంక్షల కారణంగా తెలంగాణకు కొత్త అప్పు దొరక్క.. రాష్ట్రానికి వస్తోన్న ఆదాయం సరిపోని పరిస్థితుల్లో జూన్ నెలను ఎలా గట్టెక్కించాలా అని ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
అప్పులు, రుణ సమీకరణకు అనుమతివ్వాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించినా, అటు నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో తెలంగాణలో సాధారణ రెవెన్యూ ఖర్చులు, ఉద్యోగులు జీతాల చెల్లింపులు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు నిధుల సర్దుబాటు కష్టంగా మారింది. జూన్ నెలలో చెల్లించాల్సిన వేతనాలు, పెన్షన్లు, ఇతర పథకాలకూ డబ్బు కటకట ఉన్నట్లు సమాచారం.
జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు బ్రేకిచ్చి ప్రస్తుతం ఫామ్ హౌజుకే పరిమితమైపోగా, ఆర్థిక మంత్రి హరీశ్ రావు తనకు అదనంగా ఉన్న ఆరోగ్య శాఖపైనే ఫోకస్ పెడుతూ, ఆర్థిక శాఖపై సమీక్షలు సైతం నిర్వహించడం లేదని తెలుస్తోంది. దీంతో జూన్ నెల గడిస్తే తప్ప ఊపిరి పీల్చుకోలేమంటోన్న ఆర్థిక శాఖ అధికారులు.. తాత్కాలికంగా జూన్ నెలను గట్టెక్కించే మార్గాలపై దృష్టి పెట్టారు. రాబడుల ఆధారంగా చిన్నచిన్న వాయిదాల్లో చెల్లింపులు చేస్తూ పోవాలని నిర్ణయించారు.
కేంద్రం అనుమతిస్తే గనుక జూన్ నెలలో రూ.4000 కోట్ల అప్పు చేతికందుతుందని ఆశించినా, అప్పు పుట్టకపోతే ఏప్రిల్, మే నెలల ప్రతిష్టంభనకొనసాగే అవకాశాలున్నాయని, దీంతో చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్లను ఆశ్రయించే దిశగా ఆర్థిక శాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలో రూ.1,700 కోట్ల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(చేబదుళ్లు)లు తీసుకోవాలని నిర్ణయించారు. మరీ కష్టమైతే... ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు.
నిజానికి ప్రతనెలా అప్పులు లభిస్తే ఈ సమస్య కాదు. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో సెక్యూరిటీ బాండ్ల ద్వారా ఆర్బీఐ నుంచి అప్పులు పుట్టడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన రూ.11 వేల కోట్ల అప్పు చేజారింది. దీంతో జూన్ నెలకు ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టాయి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, తీసుకున్న అప్పులకు వాయిదాల చెల్లింపులకు పన్నుల రూపేణా వస్తున్న నిధులు సరిపోవడం లేదు. వీటన్నింటికీ నిధులను సర్దుబాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కేసీఆర్ సర్కారు అత్యవసర చెల్లింపులను మాత్రమే ముందుగా చేపట్టాలని భావిస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాల జోలికి వెళ్లకుండా తక్షణంగా అమలు చేయాల్సిన వాటిపై అధికారులు దృష్టి పెట్టారు. ఏప్రిల్లో రెవెన్యూ, మూలధన రాబడుల కింద రూ.10,251 కోట్లు సమకూరాయి. మే నెలలోనూ ఇంచుమించు అంతే సమకూరుతాయి. నెలవారీ సాధారణ ఖర్చు చూస్తే రూ.16 వేల కోట్లకు పైగా ఉంది. దీంతో వచ్చేదాంతోనే వేతనాల చెల్లింపులు, అత్యవసర పథకాలకు నిధుల సర్దుబాటు చేయనున్నారు. కొత్త అప్పులు దొరికితే తప్ప రైతు బంధు అమలయ్యే పరిస్థితులు లేవనే చర్చ నడుస్తోంది.
మే నెల వేతనాలను జూన్ తొలివారం లోనే చెల్లించకుండా 16వ తేదీ వరకు లాగించాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. నిధుల లభ్యతను బట్టి జిల్లాల వారీగా చెల్లిస్తూ పోవాలని, రాష్ట్ర సొంత రాబడుల ఆధారంగా వీటిని చెల్లించాలని భావిస్తున్నారు. నిధులు సర్దుబాటు కాకపోతే అన్ని రకాల పెన్షన్లు ఆగిపోయే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రాబడులు ఎలాగూ సర్దుబాటు కావని భావిస్తున్న ఆర్థిక శాఖ అధికారులు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ల(చేబదులు)పై, ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ)పై దృష్టి పెడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
రాష్ట్రం తక్షణావసరాల కోసం రూ.1,700 కోట్ల చేబదులు తీసుకోవాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారని, ఈ మేరకు ఆర్బీఐ అధికారులతో చర్చలు జరుపుతున్నారని, జూన్ నెలలో మరీ కష్టమైతే... ఈ సొమ్మును వాడుకోవాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇబ్బందులు తీవ్రమైన పక్షంలో ఓడీకి వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. అయితే ఎంత మేర ఓడీ తీసుకోవాలన్నది ఇప్పటికైతే నిర్ధారణకు రానట్లు తెలుస్తోంది. కాగా, ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) తీసుకుంటున్నారంటే, రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు ప్రభుత్వమే అంగీకరించినట్లు అవుతుందని నిపుణులు అంటున్నారు. మరి సీఎం కేసీఆర్ తన అనుభవం, చాణక్యంతో ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Financial crisis, Telangana