కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ప్రస్తుతానికి పక్కన పెట్టేసిన టీఆర్ఎస్ (TRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన భూసమస్యలపై సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్దేశం ఏదైనా ఇప్పటికైతే తలనొప్పిలా మారిన ధరణి పోర్టల్ (Dharani Portal) సమస్యల పరిష్కారానికి కేసీఆర్ నడుంబిగించారు.
తెలంగాణలో ఇంచు భూమి కూడా ఇరకాటంలో లేదంటూ ఇన్నాళ్లూ వాదించిన కేసీఆర్ ఎట్టకేలకు మండలాల వారీగా భారీ ఎత్తున రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. టీఆర్ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందాల సర్వేల్లో భూమి సంబంధిత సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలోనే సీఎం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలివే..
ధరణితో తలెత్తిన సమస్యలతోపాటు ఆయా ప్రాంతాల్లోని రైతుల భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 100 బృందాలను ఏర్పాటు చేసి, మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 11న ప్రగతి భవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.
వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ధరణి, భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం.. మంత్రులు, అధికారులతో చర్చించారు. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి సీఎంవో కీలక ప్రకటన చేసింది. ధరణిలో భూమి కొనుగోలు దారుల పేర్లు నమోదు కాకపోవడం, విక్రయించిన వారి పేరు కొనసాగడంపై పలు ఫిర్యాదులు వస్తుండటం, కొన్ని ప్రాంతాల్లో నమోదైన భూ విస్తీర్ణం కంటే ఎక్కువగా ఆయా సర్వే నెంబర్లలో చూపుతున్నట్టు పలువురు రైతుల నుంచి ఫిర్యాదులందుతుండటం ధరణిలో కీలక అడ్డంకులుగా ఉన్నాయి. అలాగే,
మరికొన్ని ప్రాంతాల్లో సర్వే నెంబర్ వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సంబంధిత భూమి లేకపోవడం, ఉన్నా విస్తీర్ణంలో అనేక వ్యత్యాసాలుండటం ప్రధాన సమస్యలుగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఆయా సర్వే నెంబర్లలోని కొంత స్థలంపై ఏర్పడిన వివాదం.. కోర్టు తీర్పులతో సర్వే నెంబర్లోని భూమి మొత్తానికి వర్తించే సాంకేతికపరమైన సమస్యలను సైతం అధికారులు గుర్తించారు. వీటన్నింటికి రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారాలు చూపాలని సీఎం ఆదేశించారు.
ధరణి, భూసమస్యలతోపాటు గురుకులాలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ, ఉపాధి శిక్షణ కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను మార్చే వ్యవహారాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో మంత్రులు, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గురుకులాల ద్వారా రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, వాటిని ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తే ఎక్కువ మంది ఉన్నత విద్యావకాశాలు అందిపుచ్చుకోగలుగుతారని ఈ సందర్భంగా సీఎం అన్నారు. దీంతోపాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఉపాధి అందించే శిక్షణా కేంద్రాలుగా మార్చాలన్నారు. మొత్తానికి..
గతేడాది హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత బీజేపీపై, కేంద్రంపై యుద్ధ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ గడిచిన కొద్ది నెలలుగా పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిపోయారనే విమర్శలు వచ్చాయి. బీజేపీని నిలువరించే క్రమంలో బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు, రాష్ట్రాల పర్యటనలతో కేసీఆర్ బిజీగా గడిపారు. కాగా, క్షేత్ర స్థాయిలో పీకే టీమ్ సర్వేల్లో టీఆర్ఎస్ కు ప్రతికూలతలు స్పష్టంగా వెల్లడైన నేపథ్యంలో జాతీయ పార్టీకంటే ముందు రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చేలా కేసీఆర్ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Dharani Portal, Land dispute, Telangana, Trs