TRS CM KCR BACK TO HYDERABAD FROM BANGALORE SAID SENSATION WILL HAPPEN IN NATIONAL POLITICS WITHIN 3 MONTHS MKS
CM KCR : కేసీఆర్ రాలేగావ్ సిద్ది పర్యటన రద్దు!.. మళ్లీ సంచలనం.. ఢిల్లీలో స్పాట్ పెట్టే ముహుర్తం ఇదేనా?
దేవేగౌడ-కుమారస్వామి నివాసంలో కేసీఆర్ భోజనం (గురువారం నాటి ఫొటో)
తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన దేశవ్యాప్త పర్యటనలో మరో అనూహ్య మలుపుగా రాలేగావ్ సిద్ది పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో సంచలనం జరుగుతోందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించగా, ఆ ముహర్తం ఎప్పుడో కుమారస్వామి ద్వారా వెల్లడైంది. వివరాలివే..
జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘటించారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా గత వారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన సందర్భంలో తొలిసారి ‘సంచలనం’ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ తాజాగా బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని కలిసినప్పుడూ అదే మాట రిపీట్ చేశారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో స్పాట్ పెట్టబోయే ముహుర్తం కూడా వెల్లడైంది. కాగా, దేశవ్యాప్త పర్యటనలో మరో అనూహ్య మలుపుగా కేసీఆర్ తలపెట్టిన రాలేగావ్ సిద్ది పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. వివరాలివే..
దేశవ్యాప్త పర్యటన షెడ్యూల్ లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న(మే 26) బెంగళూరు వెళ్లారు. గతంలో వెల్లడైన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు నుంచి ఆయన శుక్రవారం (మే 27న) మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలవాల్సి ఉంది. ఆపై శిరిడీలో సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్ తిరిగిరావాల్సిఉంది. కానీ కేసీఆర్ అనూహ్యంగా బెంగళూరు పర్యటన ముగియగానే నేరుగా హైదరాబాద్ తిరిగొచ్చారు. గురువారం రాత్రికే నగరానికి వచ్చేసిన సీఎం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తాజా అప్ డేట్స్ ను బట్టి సీఎం కేసీఆర్ శుక్రవారం చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్త ప్యటనలో భాగంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను కలుస్తోన్న సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందని బెంగళూరు వేదికగా మరోసారి వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు.. 2-3 నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది.. అని కేసీఆర్ అన్నారు. కాగా, సంచలన మార్పు అంటే మోదీ సర్కారును కూలగొట్టడమో, మరోటో కాదన్న కేసీఆర్.. ప్రస్తుతం దేశంలో ఎవరూ సంతోషంగా లేరని, రైతులు, దళితులు, ఆదివాసీలు సహా అన్ని వర్గాల వారి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, కేంద్ర పాలకులు ప్రసంగాలకు మాత్రమే పరిమితం అయ్యారని అభిప్రాయపడ్డారు.
జాతీయ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందంటూ ప్రకటన చేసిన కేసీఆర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరుగుపయనం అయ్యాక, జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యల వెనకున్న ఉద్దేశాన్ని, సంచలనం చోటుచేసుకోబోయే ముహుర్తాన్ని వెల్లడించారు. దేశమంతా విజయదశమి జరుపుకొనే రోజుల్లోనే విజయవంతమయ్యే సంచలన ప్రకటన రానుందని కుమారస్వామి అన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ విబేధాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల రీత్యా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ చర్యలు భారత భవిష్యత్తుకు పునాదులు వేస్తాయని ఆయన పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.