news18
Updated: November 12, 2020, 11:04 AM IST
కార్గో బస్..
- News18
- Last Updated:
November 12, 2020, 11:04 AM IST
ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో కరోనా కాలంలో లాభాల బాట పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టీసీ.. వజ్ర బస్సులను సరుకు రవాణా బస్సులుగా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. మహబూబ్ నగర్ ఆర్టీసీ ఆధ్వర్యంలోనూ కార్గో పార్సెల్ సర్వీస్ ఏర్పాటు చేశారు. కార్గో పార్సెల్ సర్వీస్ లో తనిఖీ వ్యవస్థ లేకపోవడంతో అక్రమ వ్యాపారులకు అవకాశంగా మారింది. కార్గో బస్సుల్లో నిషేధిత వస్తువులు రవాణా చేస్తున్నారు పలువురు అక్రమార్కులు. అందులో నిషేధ వస్తువులు రవాణా చేయవద్దని.. వాటిని అసలు బుక్ చేయరాదని ఆర్టీసీ అధికారులు బుకింగ్ పాయింట్ల దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయినా కొందరు వ్యాపారులు సరుకుల పేర్లు చెప్పి నిషేధిత సరుకులు బుక్ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో వనపర్తి కొల్లాపూర్ బస్ స్టాండ్ పరిధిలో గుడుంబా తయారుచేసే సామాగ్రి బెల్లం తో పాటు ఇతర సామాగ్రిని ఇటీవలే ఎక్సైజ్ అధికారు లు పట్టుకున్నారు. కాగా, తాజాగా కార్గో సిబ్బందిని ఒక వ్యాపారి బురిడీ కొట్టించాడు. పాత వస్తువులని చెప్పి బెల్లాన్ని హైదరాబాద్ నుంచి వనపర్తికి రవాణా చేశాడు. వాహనం ద్వారా వచ్చిన బెల్లాన్ని ఆటోలో తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. దానిని స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీ వ్యవస్థ లేకపోవడంతో.
ఆదాయంపై దృష్టి పెట్టిన ఆర్టీసీ ఉన్నత అధికారులు కార్గో పార్సెల్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోనే తమ పని అయిపోయింది అనుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరచూ నిషేధిత వస్తువులను రవాణా అవుతూ పట్టుబడుతున్నా.. చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగుచూసినప్పుడు మాత్రం తమ తప్పేమి లేనట్టు సాకులు చెబుతున్నారు. కార్గో కేంద్రాలకు వచ్చే వస్తువులను ఏమాత్రం తనిఖీ చేయకుండా.. కేవలం బరువు నమోదు చేసుకుని.. దాని ప్రకారం రుసుము వసూలు చేస్తున్నారే తప్ప అసలు అందులో ఏముంది..? దానిని రవాణా చేయొచ్చా..? లేదా..? అనేది పట్టించుకోవడం లేదు.

కార్గో పార్సిల్ కేంద్రం
చర్యలు తీసుకోవాలి...
ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుండటంతో కార్గో సర్వీస్ లో ఉన్న అధికారులు దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ తనిఖీ కేంద్రం లేకపోతే మరెన్నో అసాంఘిక శక్తులు సైతం ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని అడ్డూ అదుపూ లేకుండా తమ కార్యకలాపాలు సాగిస్తాయని ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. దీనిని ఆసరాగా చేసుకుని ఆయుధాలు సైతం పార్సిల్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మేలుకొని కార్గో పార్సిల్ సెంటర్ వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలకు తావు ఇవ్వకుండా ఉంటుందని కోరుతున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 12, 2020, 11:03 AM IST