ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి (Yadadri) లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం ఉదయం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Tribal Welfare Minister Satyavathi Rathore) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి ప్రత్యేక స్వాగతం పలికి.. ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ యాదాద్రి ప్రధానాలయ బంగారు తాపడానికి తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా (Donate gold jewelry) ఇచ్చారు. రెండు చేతి గాజులు, రింగులు, మెడ గొలుసును లక్ష్మి నరసింహ స్వామికి నిలువుదోపిడీ ఇచ్చారు. మొత్తం స్వామివారికి 12 తులాల బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. తాను కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో.. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని తాను నరసింహ స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచనాత్మక రూపకల్పనలో యాదాద్రి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారబోతోంది. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తామని, ఇందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాదు కేసీఆర్ తన ఫ్యామిలీ తరఫున కిలో 16 తులాల బంగారం విరాళంఇచ్చారు. సీఎం పిలుపుతో యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్నిలక్ష్మీనరసింహ స్వామికి విరాళంగా ఇస్తున్నారు.
ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి కుటుంబం నుంచి ఒక కేజీ, మేడ్చల్ నియోజకవర్గం నుంచి కేజీ బంగారాన్ని ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కేజీల బంగారం ఇవ్వనున్నారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరపు కిలో బంగారం ఇస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కావేరి సీడ్స్ తరపున భాస్కర్ రావు కేజీ బంగారం ఇస్తారని చెప్పారు. జీయర్ పీఠం నుంచి కేజీ బంగారం రానుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంభీపూర్ రాజు ఒక్కో కేజీ బంగారాన్ని స్వామి వారికి విరాళంగా ప్రకటించారు.
తెలంగాణ నుంచే ఏపీ నుంచి కూడా యాదాద్రి పుణ్యక్షేత్రానికి విరాళాల అందుతున్నాయి. కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇక హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారధి రెడ్డి ఏకంగా 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన కుటుంబం తరపున ఈ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Telangana, Yadadri temple