గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం (Telangana government ) చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ (Arogyasri) ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి స్థాయిలో విస్తృత పరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది వైద్యాదికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు గతంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారికి, మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్కు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ నేతృత్వంలో ప్రతి పీహెచ్సీలో ఆరోగ్యమిత్రల ద్వారా 53 రకాల వ్యాధులకు చికిత్స (Arogyasri in PHC)ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అమల్లోకి తేనున్నారు.
ఆరోగ్య కేంద్రాల సందర్శన..
దీనిపై ప్రజారోగ్య శాఖ డైరెక్ట ర్ శ్రీనివాసరావు సైతం ప్రకటన చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్సీలు) ఆరోగ్యశ్రీ సేవలు (Arogya sri in PHC) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 53 రకాల సేవ లు అందించేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ధారూరు, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. తర్వాత మద్గు ల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవనంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ అధికారులతో సమావేశమై ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేరే ప్రతి రోగి తరఫున పీహెచ్సీకి ప్రభుత్వం రూ.2,100 చెల్లిస్తుందన్నారు శ్రీనివాసరావు. ఇందులో 35 శాతం డబ్బును పీహెచ్సీలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తుందని తెలిపారు. మిగిలిన 65 శాతం నిధులను ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పీహెచ్సీలు నిధుల కొరతను అధిగమించి బలోపేతం అవుతాయన్నారు.
నాణ్యమైన ఔషధాలు..
జిల్లాలో పీహెచ్సీల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా 53 రకాల వ్యాధులకు చికిత్స అందించనున్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో పాము, తేలు కాటుతో సహా అత్యంత తీవ్రమైన వ్యాధులను సైతం గుర్తించి సంబంధిత దవాఖానలకు పంపించి మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలతో ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుబాలోకి రానున్నాయి.
వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో..
750 ఎంబీబీఎస్ వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుందని శ్రీనివాసరావు తెలిపారు. పీహెచ్సీల్లో చేసే ప్రతి సాధారణ కాన్పుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుందని, ఈ మొత్తం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తుందన్నారు. క్షేత్రస్థాయి లో పీహెచ్సీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీనివాసరావు చెప్పారు. వైద్యుల్లో ఉత్సాహం పెరిగి నాణ్యమైన సేవలు అందుతాయన్నారు శ్రీనివాసరావు. వైద్యులు స్థానికంగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానికంగా ఉంటున్నారా..? లేదా నగరానికి వెళ్లి వస్తున్నారా..? అనే వివరాలు తెలుసుకునేందుకు వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్ అమరుస్తామని చెప్పారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్యులు, సిబ్బంది పని తీరును పర్యవేక్షించేలా ప్రతి పీహెచ్సీలో 3 సీసీ కెమెరాలు అమరుస్తామని తెలిపారు శ్రీనివాసరావు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aarogyasri, Phc, Telangana