తెలంగాణ (Telangana)లోని ఆస్తిపన్ను (Property tax) బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను పై మున్సిపల్ శాఖ (The municipal department) కీలక ప్రకటన చేసింది. 90 శాతం వడ్డీ (Interest)ని మాఫీ చేస్తూ ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్ స్కీం) ను ప్రకటించింది. జీహెచ్ఎంసీ (GHMC) సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తూ ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో నం 485 తీసుకొచ్చారు అధికారులు. ఈ గడువు అక్టోబరు 31తో గడువు ముగియనుంది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో రూ.1626.83 కోట్లు బకాయిలు పేరుకపోవడంతో వాటిని వసూలు చేసేందుకు ఓటీఎస్ (వన్ టైం స్కీం)ను ప్రవేశపెట్టింది.
తెలంగాణలో ఆర్థిక సంవత్సరం 2021-22 వరకు ఉన్న బకాయిలను 10 శాతం వడ్డీతో ఈ పథకం కింద చెల్లించవచ్చని ప్రకటనలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పేర్కొన్నారు. ఒకవేళ బకాయిలను పూర్తి వడ్డీతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జులై 16 మధ్య చెల్లించి ఉంటే.. వారికీ ఓటీఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు చెల్లించిన వడ్డీలో 90 శాతాన్ని వెనక్కు ( 90 percent concession) ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆస్తిపన్ను డిమాండ్లో సర్దుబాటు చేస్తారు.
జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 సెక్షన్ 679-ఈ ప్రకారం..
గ్రేటర్ హైదరాబాద్లో గతేడాది వరకు 5 లక్షల మందికి పైగా రూ.1400 కోట్లకు పైగా ఆస్తిపన్ను చెల్లించవలసి ఉంది. 15 నుంచి 20 సంవత్సరాలుగా ఆయా భవనాలకు సంబంధించిన పన్ను వసూలు కావడం లేదు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 సెక్షన్ 679-ఈ ప్రకారం ఓటీఎస్ పథకం కింద ఆస్తిపన్నుపై వడ్డీని మాఫీ చేయాలన్న ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ గతేడాది ఆమోదించింది.
నల్లగొండ, కరీంనగర్, వరంగల్..
ఇక తెలంగాణలోని మున్సిపాలటీలను పరిశీలిస్తే.. నల్లగొండ మునిసిపాలిటీలో 48 వార్డులకు 33వేలపై చిలుకు గృహ నిర్మాణాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏటా సుమారు రూ.19కోట్లు మేర ఆస్తి పన్ను రూపేనా ఆదాయంరానుం ది. ఇకపోతే ఇప్పటివరకు సుమారు రూ.4కోట్ల మేర వడ్డీ బకాయిలు ఉన్నట్లు తెలిసింది. 90శాతం వడ్డీ మాఫీ స్కీం ద్వారా రూ.3.60కోట్లు వడ్డీ మాఫీ కానుంది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో బకాయిదారులు ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు పెండింగ్ బకాయిలు మూడు కోట్ల వరకు ఉండగా ఏకమొత్తంలో పన్నులు చెల్లించి వడ్డీ మాఫీని ఇంటి యజమానులు వినియోగించుకుంటే నగరపాలక సంస్థకు కోటి నుంచి కోటి 50 లక్షల మేరకు ఆదాయం వస్తుంది. అలాగే రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, నగరపాలికల్లోనూ ఆస్తి పన్ను బకాయిలు కోట్లలో పెండింగులో ఉన్నాయి. వీటిని వెంటనే చెల్లించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.2020 ఆగస్టులో కూడా ప్రభుత్వం ఇదే మాదిరి ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Municipal Corporations, Property, Taxes, Telangana