హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (15) 8వ తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన, అప్పటికే పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్న బంధువు (26) వ్యక్తిగత పనుల నిమిత్తం నవంబర్ నెలలో వీరి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో బాలిక తల్లిని అక్క అని పిలిచేవాడు. పని నిమిత్తం వచ్చిన అతను కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు. ఆ సమయంలో బాలిక మీద కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు రోజువారీ పనికి బయటకు వెళ్లగా.. ఆ బంధువు బాలికను బెదిరించి బయటకు తీసుకెళ్లి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి (raped)పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తాను అంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. ఆ బంధువు చేసిన మోసం కారణంగా వచ్చిన గర్భం (Pregnancy) దాల్చింది. ప్రెగ్నెన్సీ తొలగించుకోవడానికి ఆ బాలిక హైకోర్టు గడప తొక్కింది.
మైనర్ బాలికపై అలా చేస్తే తప్పే..
అంతకుముందు ఈ అవాంఛిత గర్భాన్ని తొలగించాలని కుటుంబసభ్యులు నీలోఫర్ (Nilofar Hospital) ఆశ్రయించారు. అందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అబార్షన్ చేయాలంటే చట్టప్రకారం అనుమతులు అవసరం.. అని చెప్పడంతో బాలిక (Minor girl) తరఫున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. 15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. మైనర్ బాలిక ఇష్టపూర్వకంగా శృంగారం చేసినా, బలవంతంగా చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
జీవించే హక్కు కోల్పోతుందనే..
గర్భం కారణంగా మైనర్ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని… శారీరకంగా, మానసికంగానూ ప్రభావం ఉందని కోర్టు పేర్కొంది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవచ్చు అని వెల్లడించింది. అయితే దీనికి ముందు బాలిక (Minor girl)తో మాట్లాడాల్సి ఉందని చెప్పింది. 20 వారాల గర్భంతో కోర్టుకు రావడం ఇబ్బందికరమని తెలపడంతో.. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్కు తమ అభిప్రాయం చెప్పాలని కోరింది. బాలిక (Minor girl)తో, ఆమె తల్లితో సూపరింటెండెంట్ విడివిడిగా మాట్లాడాలని ఆదేశించింది. అబార్షన్ వల్ల ఎదురయ్యే అన్ని పరిణామాలను వారిద్దరికీ వివరించాలని, ఇద్దరూ అంగీకరిస్తే జాప్యం లేకుండా గర్భవిచ్ఛిత్తి చేయాలని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులకు హైకోర్టు ఆదేశించింది.
ఎలా బయటపడింది?
కొద్దిరోజుల తర్వాత అతడి పనులు అయిపోవడంతో ఖమ్మం తిరిగి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో బాలిక (Minor girl) తరచుగా అనారోగ్యానికి గురవుతూ వస్తుంది. ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులకు బంధువు చేసిన విషయం చెప్పింది. వెంటనే వారు బంజారాహిల్స్ పోలీసులను ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తరువాత వైద్యపరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో ఆమె తల్లి ముందు నిలోఫర్ వైద్యులను.. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.