తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశాల నేపథ్యంలో.. గురుకులాలు మినహా మిగతా స్కూల్స్లో రేపటి నుంచి తరగతులు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అడ్వొకెట్ జనరల్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు సవరణలు చేస్తూ రేపటి(సెప్టెంబర్ 1) నుంచి పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనల పాటిస్తూ పాఠశాలలు తెరిచేందుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాలలు బలవంతపెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్లైన్, ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది.
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రత్యక్ష బోధన వద్దని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించింది.
రేపటి నుంచి స్కూళ్లు తప్పనిసరి కాదు.. తెలంగాణ హైకోర్టు ఆర్డర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.