శుభకార్యానికి వెళ్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. లారీ బీభత్సవంతో ఒకే కుటుంబానికి నలుగురు మృతిచెందారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను జిల్లాలోని తెప్పలమడుగు గ్రామసర్పంచ్ తరి శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వివరాలు.. తరి శ్రీనివాస్ (34), అతడి భార్య విజయ (30 వారి ఇద్దరి పిల్లలు శ్రీవిద్య, కన్నయ్యలతో కలిసి శుభకార్యానికి బయలుదేరారు. అయితే మిర్యాలగూడ నుంచి బియ్యం లోడ్తో వస్తున్న లారీ.. నిడమనూరు వద్ద టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో టాటా ఏస్ వాహనం వెనకకి ఒరిగింది. అదే సమయంలో వెనకాలే వస్తున్న తరి శ్రీనివాస్ బైక్కు టాటా ఏస్ వాహనం తగిలింది.
దీంతో తరి శ్రీనివాస్ అతడి భార్య విజయ అక్కడికక్కడే మృతిచెందారు. వారి పిల్లలు శ్రీవిద్య, కన్నయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స పొందుతూ చిన్నారులు ఇద్దరూ చనిపోయారు. ఇక, ఈ ప్రమాదం జరిగిన సమయంలో టాటా ఏస్ వాహనంలో ఉన్న ముగ్గురికి కూడా గాయాలు అయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక, ఘటనతో తరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గ్రామ సర్పంచ్, అతని కుటుంబ సభ్యులు మరణించారనే వార్త తెలుసుకున్న నిడమనూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.