news18-telugu
Updated: August 16, 2020, 8:28 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసులకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషనరేట్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత రెండు రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగు సూచనలు, సలహాలను ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించామన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అదికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, ఉత్తర కోస్తా, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గాంగ్ టక్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్ట్ 19 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో నిన్న ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా కురిశాయి. నేడు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published by:
Shiva Kumar Addula
First published:
August 16, 2020, 8:27 PM IST