TELANGANA POLITICS TICKETS WILL BE ALLOCATED ACCORDING TO PRASHANT KISHOR SURVEY REPORTS IN NEXT ELECTIONS SAYS MINISTER KTR IN KHAMMAM MEETING SK
Telangana: పీకే చెప్పినోళ్లకే టికెట్లు.. తేల్చిచెప్పిన కేటీఆర్.. ఆ ఎమ్మెల్యేల్లో వణుకు
ప్రశాంత్ కిశోర్, కేటీఆర్
Telangana Politics: వచ్చే ఎన్నికల్లో మొహం చూసి బొట్టుపెట్టే పరిస్థితి ఉండదని మంత్రి కేటీఆర్ ఆ పార్టీ నేతలతో అన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. పీఎం టీమ్ సర్వే రిపోర్టు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor).. మన దేశంలో ఎంతో పేరుమోసిన ఎన్నికల వ్యూహకర్త. ఈయన ఏదైనా పార్టీ కోసం పనిచేశాడంటే.. ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే. గతంలో జరిగిన పలు ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఐతే ప్రస్తుతం పీకే టీమ్ (PK team in Telangana) తెలంగాణలో టీఆర్ఎస్తో జత కట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రూపొందిస్తున్నారు ప్రశాంత్ కిశోర్. అసలు టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొదన్నది కూడా ప్రశాంత్ కిశోరే డిసైడ్ చేయనున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగానే టికెట్ల పంపిణీ ఉంటుంది. ఇదేదో రాజకీయ విశ్లేషకులు చేసిన కామెంట్స్ కాదు. స్వయంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఈనాడు తన కథనంలో పేర్కొంది. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం పర్యటన అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్లెడ్డి నివాసంలో విందుకు హాజరయ్యారు. అనంతరం నేరుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ ముఖ్య నేతలతో సమావేశమై.. వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారని, ఆ నివేదికల ఆధారంగానే టికెట్లు దక్కుతాయని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొహం చూసి బొట్టు పెట్టే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారట. అవసరమైన చోట మార్పులు తప్పవని.. గెలుపు గుర్రాలకు టికెట్లను ఇస్తామన్నట్లు తెలుస్తోంది. టికెట్లు రాని నేతలను పార్టీ వదులుకోబోదని.. వారి సేవలను వేరొక చోట వినియోగించుకుంటామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. నేతలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు.
విభేదాలు పక్కనబెట్టి నాయకులంతా సఖ్యతతో పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలిచేలా కలిసి పనిచేయాలని సూచించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwararao) అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఇతర నేతలకు చెప్పారు. జనంలో ఉన్న పొంగులేటి వంటి నాయకులను కలుపుకొని పోవాలని అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరు ఎంపీలు జూన్ 18న ఖమ్మం వెళ్లనున్నారు. వారికి ఘనస్వాగతం పలికి అంతా కలిసికట్టుగా ఉన్నామన్న సందేశం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని..మళ్లీ మనకే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఐతే కొంత మంది నేతలపై మాత్రమే వ్యతిరేకత ఉందని.. అంలాంటి వారు వెంటనే తమ పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. ప్రతి నాయకుడు పోలీస్ కాన్వాయ్తో వెళ్తుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది.. ఇలాంటి వాటిని తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ టీమ్ సర్వే చేస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? కేసీఆర్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారా? మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా? వంటి అంశాలపై ప్రజల స్పందనను తెలుసుకుంటోంది. అనంతరం ఓ నివేదిక రూపొందిస్తారు. ఏయే ఎమ్మెల్యే పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న వివరాలను సీఎం కేసీఆర్కు అందజేస్తారు. దాని ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని.. మంత్రి కేటీఆర్ మాటలను బట్టి అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలయింది. ప్రజలకు తమకు వ్యతిరేకంగా చెబితే.. పరిస్థితి ఏంటని ఇప్పుడి నుంచే ఆలోచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.