తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో రేపు మరోసారి వాదనలు జరగనున్నాయి. విచారణ నేపథ్యంలో అధికారులు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని కోర్టుకు అధికారులు తమ అఫిడవిట్లలో స్పష్టం చేశారు. ఆర్టీసీకి రూ.3,006 కోట్ల అప్పులు ఉంటే ప్రభుత్వం రూ.3,903 కోట్లు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.
మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వానికి ఆర్టీసీనే రూ.540 కోట్లు ఇవ్వాలని అఫిడవిట్లో వెల్లడించారు. రుణం పద్దు కింద విడుదల చేసినవాటికి ప్రభుత్వం ఎప్పుడూ వడ్డీ అడగలేదని అందులో వివరించారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బట్టే ఆర్టీసీకి సాయం చేసిందని... ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అధికారులు తమ అఫిడవిట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే... సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో... రేపు ఆర్టీసీ సమ్మె అంశంపై హైకోర్టు ఏదైనా కీలక ఆదేశాలు ఇస్తుందా ? అన్న అంశం ఉత్కంఠగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, GHMC, Telangana High Court, Tsrtc privatization, TSRTC Strike