news18-telugu
Updated: September 5, 2019, 5:18 PM IST
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
తెలంగాణలో యూరియా కోసం క్యూలో నిలబడిన ఓ రైతు గుండెపోటుతో చనిపోతే సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి ఆ రైతు మరణంపై వెటకారం కామెంట్లు చేశారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘యూరియా లారీలు అక్కడే ఉన్నాయి. అందులో నుంచి యూరియా సంచులు దించుతున్నారు. మరోవైపు రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఆ క్రమంలో లైన్లో నిలబడిన ఓ రైతుకు దురదృష్టవశాత్తూ గుండెపోటు వచ్చింది. ఆయన లైన్లో నిలబడడం యాదృచ్ఛికం. అంతేకానీ, యూరియా కోసం జరిగింది కాదు. సినిమా హాల్ దగ్గర క్యూలో నిలబడతాం. టికెట్ తీసుకునేలోపు ఏదైనా ఆపద జరిగితే సినిమా హాల్ వాడిది తప్పుకాదు. మీటింగ్కి వచ్చాం. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగిదే మీటింగ్ది తప్పుకాదు. కొన్ని యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలను అసలు దానితో ముడిపెట్టడం సరికాదు. కొందరు కేసీఆర్ మీద విషం కక్కడానికి ఇలాంటి వాటిని సాకుగా వాడుకుంటున్నారు’ అని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఓ రైతు యూరియా కోసం క్యూలైన్లో నిలబడి ఉండగా హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోయాడు. దీనిపై స్పందించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ జిల్లా అర్గుల్లో ఎరువుల కోసం క్యూలో చెప్పులు పెట్టి నిలబడిన రైతులు (File)
తెలంగాణలో వర్షాలు ఆలస్యంగా పడడంతో రైతులు కూడా చివరి నిమిషంలో పంటలు సాగు మొదలుపెట్టారు. అయితే, అందుకు సరిపడా యూరియా అందుబాటులో లేదు. కర్ణాటకలో అత్యవసరం కావడంతో తెలంగాణకు రావాల్సిన యూరియాను అక్కడికి తరలించారు. ఉత్తరాదిలో వర్షాలు కురవడంతో వ్యాగన్లలో రావాల్సిన సరుకు ఆలస్యంగా చేరుకుంది. అయినా సరే, ప్రజలు భయపడాల్సిన పనిలేదని, కొన్ని రోజులు ఆలస్యం అయిందే కానీ, ఎక్కడా కొరత లేదని వ్యవసాయ మంత్రి చెప్పారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 5, 2019, 4:33 PM IST