అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రోజు అనుకోని విషాదం చోటుచేసుకుంది. కన్నవారు చిన్నతనంలోనే దూరమయ్యారు . . అన్నాచెల్లెళ్లు ఇద్దరూ అమ్మమ్మ , తాతయ్యల చెంత పెరిగారు. ఇటీవలే చెల్లెలి పెళ్లయింది . ఈ క్రమంలో రాఖీ పండగ రోజున సోదరితో రాఖీ కట్టించుకోవాలని వెళ్తున్న అన్న మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లికి చెందిన వేల్పుకొండ రాకేశ్ 26 ) తల్లిదండ్రులు మహేందర్ , స్వరూప బాల్యంలోనే మృతి చెందారు. దీంతో రాకేష్, అతని చెల్లెలు రమ్య.. రమ్య జమ్మికుంట మండలం రామన్నపల్లెలోని అమ్మమ్మ సందిల లక్ష్మి , తాతయ్య బుచ్చయ్య సంరక్షణలో పెరిగారు.
రాకేష్ ప్రస్తుతం కరీంనగర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చెల్లెలు రమ్యకు రెండు నెలల కిందట.. పొత్కపల్లికి చెందిన యువకుడితో పెళ్లి చేశారు. రాఖీ పండగ నేపథ్యంలో బంధువులను కారులో సుల్తానాబాద్లో దించాడు. ఆపై చెల్లెలి వద్దకు బయలుదేరాడు. అయితే కనగర్తి సమీపంలోని దానకుంట చెరువుకట్టపై రాకేష్ వెళ్తున్న కారు అదుపుతప్పింది. దీంతో కారు పల్టీలు కొట్టి చెరువులో పడిపోయింది. దీంతో కారులో ఉన్న రాకేష్ నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు.
ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వెంటనే ట్రాక్టర్ను సాయంతో కారును, రాకేష్ను బయటకు తీశారు. అయితే అప్పటికే రాకేష్ మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోత్కపల్లి ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. కాగా, అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, చిన్నతనంలో తల్లిదండ్రుల మృతి, ఇప్పుడు ఇలా రాఖీ పండగ రోజే అన్న మరణించడంతో రమ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.