కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సడలింపులతో దాదాపు లాక్డౌన్ ఎత్తివేసినంత పరిస్థితి ఏర్పడింది. అయితే కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ న్యాయ వ్యవస్థకు సంబంధించి లాక్డౌన్ను జూన్ 28 వరకు పొడగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులు, ట్రిబ్యూనళ్లకు జూన్ 28 వరకు, జిల్లా, మేజిస్ట్రేట్, ట్రిబ్యూనళ్ల లాక్డౌన్ ఈనెల 14 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అత్యవసర, తుది విచారణ కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలంటూ జిల్లా కోర్టులకు స్పష్టం చేసింది.
అయితే రెండు వైపులా లాయర్లు ప్రత్యక్ష విచారణ కోరితే మాత్రం జ్యూడిషియల్ అకాడమీలో ఏర్పాటు చేసుకోవచ్చి హైకోర్టు తెలిపింది. దీనికితోడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో నేరుగా పిటిషన్లు దాఖలు చేసేందుకు అవకాశమిచ్చింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజర్ల వాడకం వంటి చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Lockdown, Telangana