తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా మరో అద్భుతమైన పథకాన్ని తీసుకొస్తోంది. గర్భిణీలకు (Pregnant) పౌష్టికాహారం అందించి.. మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా.. న్యూట్రిషన్ కిట్స్ (Nutrition Kit scheme) అందించబోతోంది. మరో పది రోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్ను హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. త్వరలోనే న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
పోషకాహార కిట్లో ఒక కేజీ న్యూట్రీషనల్ మిక్స్ పౌడర్ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, ఒక అల్బెండజోల్ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్లో ఒక ప్లాస్టిక్ కప్ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఉంచేలా ఒక బ్యాగ్ లేదా బాక్స్ ఇవ్వనున్నారు. ఒక్కో కిట్ ధర రూ.2 వేల వరకు ఉంటుంది. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు ఈ కిట్లు ఇస్తారు. గర్భం దాల్చిన మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలల తర్వాత మరోసారి.. న్యూట్రిషన్ కిట్లను గర్భిణీ స్త్రీలకు అందజేస్తారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్ , భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం , కామారెడ్డి , వికారాబాద్ , గద్వాల, నాగర్ కర్నూలు , ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం కేసీఆర్ పోషకాహార కిట్ పథకం అమలు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేశారు.
కాగా, గర్భం దాల్చిన సమయంలో తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో ప్రసవ సమయంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుట్టిన శిశువు పై ప్రభావం ఉంటుంది. అంగన్వాడీల ద్వారా పోషకాహార పథకాలను అందిస్తున్నా.. పరిస్థితుల్లో అనుకున్న మేరకు మార్పురాని నేపథ్యంలో పోషకాహార కిట్ల పంపిణీ పై ప్రభుత్వం దృష్టి సారించింది. వీటితో పోషకాహార లోపం తగ్గడమే కాకుండా మాతాశిశు మరణాలను నియంత్రించవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.