కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణలోని పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధపడ్డ విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందజేయాలని ఆయన సంకల్పించారు. ఆ ఉచిత బియ్యాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందజేయనున్నారు. మంగళవారం బియ్యం పంపిణీకి చేపట్టాల్సిన చర్యలపై పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ పీ సత్యనారాయణరెడ్డి, అధికారులతో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం నుంచి రేషన్ పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో 1.09 కోట్ల కుటుంబాలు ఉండగా 87.59 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రేషన్దుకాణాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉచితంగా రేషన్ ఇస్తున్నందుకు ప్రభుత్వంపై రూ.1,103 కోట్ల భారం పడుతున్నదని చెప్పారు.
ఇదిలా ఉండగా, నిత్యావసరాల సరుకులు కొనుక్కునేందుకు ప్రతి రేషన్ కార్డుకు రూ.1,500 చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల పంపిణీకి ఈ-కుబేర్ సాఫ్ట్వేర్ను వాడనున్నారు. ఆహారభద్రత కార్డుల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆధార్కార్డు ఆధారంగా సమకూర్చి.. ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Corona, Coronavirus, Covid-19, Ration card, Telangana, Telangana News