ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం దానికి సంబంధించిన నివేదికను విడుదల చేశారు. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 170 శాతం వృద్ధి సాధించగా, రాష్ట్రం 190 శాతంతో దూసుకెళ్తోందని తెలిపారు. ఇక, 2020లో ఐటీ రంగంలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. పరోక్షంగా మరో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. గత ఏడాది రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రూ.23,052 కోట్లు పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మరోవైపు, జూన్లో 1,700 రేషన్ షాపులను టీ-వాలెట్తో అనుసంధానం చేస్తున్నామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని తెలిపారు. శనివారం నాడు సచివాలయంలో ఆయన జయేశ్ రంజన్, వెంకటేశ్వర్లుతో కలిసి టీ వాలెట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ వాలెట్ అనుసంధాన సేవలను ఆగస్టు చివరల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే మీ సేవ, ఈ సేవ, పీఎస్సీ, దోస్త్, విజయ డెయిరీ వంటి సేవలు టీ వాలెట్తో లింక్ అయ్యాయని చెప్పారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.