తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ పర్యటన సందర్భంగా కలెక్టరేట్లో దళితబంధు అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. తాను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్ధిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేశానని అన్నారు. దళితబంధు గత సంవత్సర మే ప్రారంభమయ్యేది ఉండేదని.. కానీ కరోనా కారణంగా ఆలస్యమైందని కేసీఆర్ మరోసారి వివరించారు. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నామని అన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని.. సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నామని.. కరెంట్ను నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నామని అన్నారు. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నదని అన్నారు.
ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని కేసీఆర్ తెలిపారు. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నామని అన్నారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా ప్రభుత్వం నిలబడిందని కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాల ను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను స్ఫూర్తిని అందిస్తోందని అన్నారు. రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించామని కేసీఆర్ తెలిపారు. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నదని అన్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.
Kalvakuntla Kavitha: కవితకు సవాల్ విసరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డి ప్లాన్
కళ్యాణలక్ష్మి, కేసిఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నామని తెలిపారు. కరీంనగర్లో సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీంద్రసింగ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నేతలు మేడి మహేష్, కంసాల శ్రీనివాస్, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్, గోసుకంటి అరుణ్, నల్లా కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Dalitha Bandhu, Siddipet, Telangana