తెలంగాణలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్కౌంటర్(Disha Case Encounter) ఘటన బూటకమని.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో సుప్రీంకోర్టుకు కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. పోలీసులు కావాలనే నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో పేర్కొంది. పోలీస్ మ్యానువల్కు భిన్నంగా విచారణ చేపట్టినట్టు తెలిపిన కమిషన్.. నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయం పోలీసులు దాచారని నివేదికలో వెల్లడించింది. పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చేరడం కట్టుకథ అని ఆరోపించింది.ఎన్కౌంటర్ స్థలంలో సీసీటీవీ ఫుటేజీ దొరక్కుండా చేశారని.. దిశ నిందితులే ముందుగా పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధమని రిపోర్ట్లో పేర్కొంది.
దిశ నిందితులను చంపాలనే ఉద్దేశ్యంతోనే పోలీసులు కాల్పులు జరిపారని..ఇవి మూక దాడుల లాంటివే అని అభిప్రాయపడింది. ఈ ఫేక్ ఎన్కౌంటర్కు పాల్పడిన 10 మంది పోలీసులు(Police) సురేందర్, నర్సింహారెడ్డి షేక్ లాల్ మదర్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, వెంకటేశ్వర్లు అరవింద్ గౌడ్, జానకిరామ్, బాలు రాథోడ్, డి. శ్రీకాంత్పై 302 సెక్షన్ కింద హత్య కేసు పెట్టాలని కమిషన్ సిఫార్సు చేసింది. చట్టపరమైన పలు నిబంధనలను, పోలీసు మాన్యువల్ రూల్స్ని అతిక్రమించారని.. మీడియాకు, విచారణ కమిషన్కు పోలీసులు కట్టుకథలు చెప్పారని ఆరోపించింది. ఇక దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. అభ్యంతరాలను హైకోర్టుకు చెప్పాలని సూచించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు అందించాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలు జారీ చేసింది.
2019 నవంబర్ 27న ఉదయం 8.30 టైమ్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్ప్లాజా దగ్గర నేషనల్ హైవే పక్కన ఆపి పని మీద వెళ్ళిన 26 ఏళ్ల దిశ... నలుగురు దుర్మార్గుల కంట పడింది. రాత్రి తిరిగి వచ్చిన దిశ తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లబోయింది. అప్పటివరకూ ఆమె కోసం ఎదురుచూసిన ఆ నలుగురూ ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయారు. ఓ పాత ప్రహరీ పక్కకు తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేసారు. తర్వాత ఆమె ప్రాణాలు తీశారు. ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్నగర్ శివారులోని చటాన్పల్లి బైపాస్ వంతెన కింద దహనం చేశారు. డిసెంబర్ 28న తెల్లారి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరినీ కదిలించింది. అదే రోజు రాత్రి నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నిందితులను నవంబర్ 29న షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వారిని ఎన్కౌంటర్ చేయాలని వేల మంది ప్రజలు పోలీస్స్టేషన్ ముందు ధర్నా చేశారు. తమకు అప్పగిస్తే తామే చంపుతామన్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాఠీ చార్జీ జరిగింది. అదే రోజు నిందితులను తహిసీల్దార్ ముందుంచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు నిందితులను భారీ బందోబస్తు మధ్య షాద్నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. తర్వాత పోలీసులు కస్టడీకి కోరడంతో డిసెంబర్ 3న కోర్టు 10 రోజుల కస్టడీకి ఇచ్చింది. హంతకులు వాడిన లారీలో ఆధారాలను డిసెంబర్ 5న సేకరించారు. డిసెంబర్ 6 తెల్లవారు జామున నలుగురు నిందితులనూ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నిందితులనూ పోలీసులు కాల్చి చంపారు.
CM KCr | Rameswar Rao Jupally: కేసీఆర్తో విభేదాలు.. మైహోం జూపల్లికి బీజేపీ రాజ్యసభ సీటు?
Pawan kalyan in Nalgonda: తెలంగాణలో జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి పెడతా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయి కాబట్టి... సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తెల్లవారు జామునే నిందితులను అక్కడికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తమ దగ్గర నుంచి ఆయుధాలను లాక్కొని... తమపై కాల్పులు జరపబోతుంటే... ఆత్మరక్షణలో భాగంగా తామూ కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అక్కడికక్కడే చనిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha accused Encounter