తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సీఎస్ గా సోమేశ్ నియామకంపై రేవంత్ వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీహార్ ముఠాకు సోమేశ్ కుమార్ లీడర్, అనర్హుడైన సోమేశ్ కుమార్ ను ఆ పదవి నుంచి తొలగించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి. అలాగే ఆయన తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ కు రైతుల గోస తప్పకుండ తాకుతుందన్నారు. సోమేశ్ కుమార్ ఏపీకి చెందిన క్యాడర్. అర్హత లేకపోయిన ఆయనను సీఎం కేసీఆర్ నియమించారన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాగా నేడు సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఆయనను ఏపీకి వెళ్లాలని, అంతకు అవసరమైతే ఏపీ సర్కార్ అనుమతి తీసుకొని తెలంగాణలో పని చేయాలని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో కోర్టు నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి స్వాగతిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కోర్టు తీర్పుపై సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నాం. తాజాగా హైకోర్టు అదే చెప్పింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలి. pic.twitter.com/6VtMSXUWUk — Revanth Reddy (@revanth_anumula) January 10, 2023
ప్రస్తుతం తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) సహా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి చెందిన వారు. వీరందరిని కూడా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించింది. కానీ వీరంతా (CAT) కేంద్ర పరిపాలన టిబ్యునల్ దగ్గర పర్మిషన్ తీసుకొని తెలంగాణకు వచ్చారు. దీనితో కేంద్రం 2017లోనే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నేడు సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) న్యాయవాది అభ్యర్ధనతో కోర్టు తీర్పును 3 వారాల పాటు నిలిపివేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cs somesh kumar, High Court, Hyderabad, Mp revanthreddy, Telangana