(కట్టా లెనిన్, ఆదిలాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ రియల్టర్ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో ఉన్న తన్వి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న విజయ్ దేశ్ పాండేను ఈ రోజు ఉదయం 7.30 సమయంలో సంగారెడ్డి కి చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయనను బలవంతంగా లాక్కొని అపహరించారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. సత్వరమే రంగంలోకి దిగిన నిర్మల్ పట్టణ పోలీసులు అప్రమత్తమై వారిని వెంబడించారు.
ఇది గమనించిన కిడ్నాపర్లు టోల్ ప్లాజా వద్ద ఆగకుండా వెళ్లడంతో, పట్టణ పోలీసులు ఇందల్వాయి, మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాపర్ల ను వెంబడించి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక కారును, తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద మరో కారులోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంటలోనే కిడ్నాప్ కేసును చేదించిన నిర్మల్ పట్టణ పోలీసులను, ఇందల్వాయి, మేడ్చల్ పోలీసులను నిర్మల్ డిఎస్పి ఉపేంద్రా రెడ్డి అభినందించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలే కిడ్నాప్ కు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డిలో విజయ్ దేశ్ పాండే రెండు కోట్ల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు తెలిసింది. సంగారెడ్డి కి చెందిన కృష్ణారావు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రా రెడ్డి తెలిపారు. పోలీసులు బాధితుడిని , నిందితులను తీసుకుని నిర్మల్ కు వస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Crime, Kidnap, Telangana crime news