రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం వరుస హత్యలతో అట్టుడికిపోతోందనేచెప్పాలి. మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఓ యువకుడు అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్(30). మృతునికి భార్య స్వప్న, కొడుకు వున్నారు. భార్యతో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. భర్త వేధింపులు భరించలేక స్వప్న వేములవాడ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. దీంతో గణేష్ తన భార్యను వెతుక్కుంటూ.. స్వప్న సొంత గ్రామమైన వట్టెంల గ్రామానికి వెళ్లి చూడగా అక్కడ తన భార్య స్వప్న కనిపించలేదు. దీంతో ఎక్కడ ఉందో చెప్పాలని అమ్మాయి కుటుంబ సభ్యులతో గొడవకి దిగాడు.
దీంతో వారు డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకొని గణేష్ ను అక్కడి నుండి వెళ్ళగొట్టారు. భార్య స్వప్న తన అమ్మమ్మ గ్రామమైన నర్సింగపూర్ గ్రామంలో ఉందని గణేష్ తెలుసుకొని అక్కడికివెళ్ళాడు. అక్కడ జరిగిన వాగ్వాదం గణేష్ హత్యకు దారితీసింది. మృతుని భార్య బంధువులు గణేష్ కు కళ్ళలో కారం కొట్టి గొడ్డలితో నరికిచంపినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం కోసం గణేష్ మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించామని, ప్రాథమిక విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. మృతుడిని గొడ్డలితో చంపినట్లు తెలుస్తోందని డీఎస్పీ తెలిపారు.
కాగా, ఈ హత్యపై చందుర్తి మండల సీఐ కిరణ్ కుమార్, ఎస్ఐ రమేష్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చందుర్తి మండలంలో ఈ హత్య జరగడం హాట్ టాపిక్ గా మారుతోంది. జిల్లా పోలీసు అధికారులు సైతం ప్రత్యేక నిఘా పెంచినట్లు తెలుస్తోంది. క్రైమ్ రేట్ తో పాటు దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఒకవైపు జిల్లా పోలీస్, కళాబృందం సభ్యులు ఆటపాటలతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కాగా.. ఈ సమయంలోనే ఈ హత్య జరగడంతో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana, Vemulawada