భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రాజెక్టు 'వందే భారత్'.ప్రజలకు సౌకర్యవంతంగా మంచి ప్రయాణ అనుభూతిని కల్పించడానికి, తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకునే విధంగా వీటిని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికే దేశంలో ప్రముఖ నగరాలకు ఈ వందే భారత్ రైలు సర్వీసుల్ని కేంద్రం ప్రారంభించింది. ఇటీవలే సికింద్రాబాద్ టు వైజాగ్ వందే భారత్ ట్రైన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. దీని తర్వాత అనేక ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రజల్లో మరికొన్ని ఆశలు చిగురిస్తున్నాయి.
ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్–2023–24 ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు, డిమాండ్లు, పనులకు ప్రాధాన్యం దక్కుతుందా..? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాంతంలో రవాణా, పర్యాటకం, పారిశ్రామికం, మానవ వనరులతోపాటు అన్నిరంగాల్లోనూ ముందంజలో ఉంచేందుకు దోహదపడే కీలక రైల్వే ప్రాజెక్టులకు నిధులు వస్తాయా..? జాబితాలో చోటు దక్కించుకుంటాయా..? ప్రతిపాదనలు వాస్తవరూపం దాలుస్తాయా..? అని ఉమ్మడి జిల్లా వాసులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రైల్వేస్టేషన్లలో సదుపాయాల కల్పన, కొత్తగా ప్లాట్ఫారాల నిర్మాణం, కొత్త రైళ్లు, వందేభారత్ రైలు.. తదితరాలపై సిరిసిల్ల, జగిత్యాల , పెద్దపల్లి , కరీంనగర్ ప్రజలంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన కొన్ని పనులతో ఇక్కడి ప్రజలో రైల్వే ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కాజీపేట– బల్లార్షా సెక్షన్, పెద్దపల్లి–కరీంనగర్–నిజామాబాద్ సెక్షన్లో వందేభారత్ కోసం ట్రాకులు సిద్ధం చేశారు.
ఈట్రాకుల సామర్థ్యం పెంచడంతో 130 కి.మీ గరిష్ట వేగం నుంచి 90 కి.మీ కనిష్ట వేగంతో ఈ రూట్లలో రైళ్లు రాకపోకలు సాగించగలవు. ఇటీవల అమృత్ పథకం కింద కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లు ఎంపికయ్యాయి. ఈ పథకం కింద ప్రతీ స్టేషన్కు రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నిధులు రానున్నాయి. మనోహరాబాద్– కొత్తపల్లి (కరీంనగర్) మార్గంలో సిరిసిల్ల– సిద్దిపేట పట్టణాలను కలుపుతూ సుమారు 30 కిలోమీటర్ల దూరం బ్రాడ్గేజ్ రైల్వేట్రాక్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే బిడ్లు ఆహ్వానించింది. ఈ పనులకు రూ.440 కోట్ల మేరకు అంచనా వ్యయాన్ని కూడా రూపొందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Local News