(K. haribabu, Nes 18, Rajanna siricilla)
Organic farming: తెలంగాణ యువ రైతు (Young farmer) 12 రకాల దేశీయ వరి వంగడాలను సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాగు చేస్తూ.. ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కోనరావుపేట మండలం కొండాపురం గ్రామానికి చెందిన చౌటపల్లి చంద్రశేఖర్ అనే యువ రైతు గత కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు.
గల్ఫ్ నుంచి గ్రామానికి
ఊరిలో ఉపాధి లేక కొన్నేళ్లు గల్ఫ్ బాట పట్టాడు. ఎడారి దేశానికి వలస వెళ్లి అనేక కష్టాలు పడ్డాడు. పరాయి దేశంలో కష్టాలు పడటం కన్నా ఉన్న ఊరిలో తానే ఉపాధి సృష్టించుకోవాలని అనుకున్నాడు. 2013లో మళ్లీ స్వగ్రామంలో అడుగుపెట్టాడు. తనకు ఉన్న వ్యవసాయ భూమి (Agricultural land)లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని కృత నిశ్చయంతో ముందడుగు వేశాడు. నిర్విరామంగా నాలుగు సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం (Organic farming) చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
మార్కెటింగ్ చేస్తే మరింత లాభం
సేంద్రీయ వ్యవసాయం (Organic farming) ద్వారా పండించిన పంటను ప్రభుత్వం మార్కెటింగ్ చేస్తే సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మరింత లాభాలు ఆర్జిస్తారని, తద్వారా సేంద్రియ వ్యవసాయం వైపు రైతన్నలు మొగ్గు చూపే ఆస్కారం ఉందని అన్నాడు. ప్రయోగాత్మకంగా 12 దేశీయ వరి వంగడాలను సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాగు చేయడంతో జిల్లాలోని అధికారులు, మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్ళాడు.
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభం
మొత్తం తనకు ఏడెకరాల వ్యవసాయం ఉందని.. నాలుగేళ్లుగా ఒక ఎకరంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపాడు. మందుల వాడకం ద్వారా వచ్చే దిగుబడి కంటే సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే పంట ఆదాయం అధికంగా ఉందని సేంద్రియ రైతు వివరించాడు.
సంపూర్ణ ఆరోగ్యం!
ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా వచ్చే పంటను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, కలుషిత ఆహారం తీసుకొని అనారోగ్యాలపాలై ఆస్పత్రి లో డబ్బులు, విలువైన సమయం వృధా చేసుకునేకంటే ముందే సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉంటా మని అన్నాడు.
12 రకాల దేశీయ వరి వంగడాలు
మణిపూర్ బ్లాక్, 1609 పూస బాస్మతి, ఇల్లేపు సాంబ బ్లాక్, నారాయణ కామిని, రక్త చోడి, ఎర్రమల్లెలు, సుగంధి, బహురూపి, ఇంద్రాణి, జీర శంకర్, హిమ శంకర్.. ఇందులో కొన్ని 90 రోజుల వ్యవధిలో మరికొన్ని 140 రోజుల వ్యవధిలో పంట పండుతుందని తెలిపాడు.
ఎమ్మెల్యే, అధికారుల అభినందనలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ (Minister KTR), వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా మండల వ్యవసాయ శాఖ అధికారులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న యువ రైతు చౌటపల్లి చంద్రశేఖర్ను అభినందించారు. అభ్యుదయ రైతు అవార్డు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు.
వరివంగడాలను చూసేందుకు వస్తున్న రైతులు
చంద్రశేఖర్ తాను సాగు చేస్తున్న 12 రకాల దేశీయ వరి వంగడాల సాగులను ఇటీవల వ్యవసాయ సంచాలకులు భాస్కర్, మండల వ్యవసాయ అధికారిణి వెంకట్రామమ్మ, ఏఈవోలు, రైతులు, గ్రామ ప్రజలు పరిశీలించారు. ఆరోగ్యంతో పాటు అధిక లాభాలు సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాధ్యపడుతుందని నిరూపిస్తున్నాడని పలువురు కొనియాడారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం చేసే వారిని ప్రోత్సహించాలని చంద్రశేఖర్ కోరాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత కష్టపడి పని చేస్తూ వంగడాలను పండించి ఇతర రైతులకు అందిస్తానని….వాళ్లు కూడా సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహిస్తానంటున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Organic Farming, Siricilla