K.Haribabu,News18, Rajanna siricilla
అమెరికాకు చెందిన చేనేత నైపుణ్య నిపుణురాలు కైరా జాప్ప్ సోమవారం సిరిసిల్లలో పర్యటించారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్ తో ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు నైపుణ్యం వంటి రంగాలపైన సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా తన అధ్యయనంలో భాగంగా సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితుల పైన ముఖ్యంగా అక్కడి చేనేత పరిశ్రమ పైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత దేశంలో తెలంగాణతో పాటు తమిళనాడు , కేరళ , కర్ణాటక , ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్, మరియు ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. సోమవారం సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని ఆమె సిరిసిల్లలోని నేతన్నలతో సమావేశమయ్యారు.
సిరిసిల్ల పట్టణంలో ఉన్న పలువురు చేనేత కార్మికుల మగ్గాలను వారు నేస్తున్న బట్టలను వారి చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాల వైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమం పైన కూడా ఆమె వివరాలు తీసుకున్నారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్ ను కలిశారు. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులను ముఖ్యంగా అగ్గిపెట్టెలు పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కైరా బృందం వెంట స్థానిక టెక్స్టైల్ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నలు ఎదుర్కొన్న ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను తమ పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు ఒక పవర్ లూమ్ క్లస్టర్ గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి ఈరోజు నేతన్నలు స్వయం సమృద్ధి వైపు సాగుతుండడం పైన ఆమె ఆసక్తి చూపారు. క్షేత్ర పరిశీలనలో ఆమె వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి తదితరులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana