Haribabu, News18, Rajanna Sircilla
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా తెలంగాణ (Telangana) పల్లెలు వెలుగొందుతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగాజాతీయ పంచాయితీ అవార్డ్ -2023 కార్యక్రమంలో భాగంగా 9 కేటగిరీల్లో మొదటి 3 స్థానాల్లో ఉత్తమంగా నిలిచిన జిల్లాలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచులకు సంబంధిత ఎంపీపీ, జెడ్పీటీసీ సమక్షంలో మంత్రి ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కొత్త పంచాయితీ రాజ్ చట్టం తెచ్చి గ్రామ పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు పెద్ద పీట వేశామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. సర్పంచులు, అధికారులు సమష్టిగా కృషిచేయడం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు.కేంద్రం, తెలంగాణ మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్న దేశంలో ఉత్తమ పల్లెలు ఎక్కడున్నాయని అంటే తెలంగాణ పల్లెలే అని చెప్పక తప్పడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం గర్వకారణమన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కు రెండు సార్లు ఉత్తమ జడ్పిగా అవార్డుకు ఎంపికైందన్నారు. 25 గ్రామపంచాయతీలు, 13 మండలాలు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్ లో వరుసగా మూడుసార్లు ఫోర్ స్టార్ రేటింతో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్, డీపీవో, జెడ్పీసీఈఓతో పాటు అందరూ క్షేత్ర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఉత్తమ గ్రామపంచాయతీలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తే అంకాపూర్ గంగదేవిపల్లి గ్రామాలే అనే సమాధానం వచ్చేదని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అన్ని అంకాపూర్, గంగాదేవి పల్లెలను తలపిస్తున్నాయని మంత్రి తెలిపారు. 12 పైగా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తెలంగాణ పల్లెలలో జరుగుతున్న అభివృద్ధి, సుపరిపాలనను అధ్యయనం చేసేందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఈ నెలాఖరులోపు 1300 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తాం..
తెలంగాణ గ్రామ పంచాయితీలకు పల్లె ప్రగతి, సీడీపీ గ్రాంట్ ల క్రింద 1 కోటి రూపాయల లోపు ఉన్న బకాయిలు 1300 కోట్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంపై ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడాడని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా పనిచేస్తే ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో రావాల్సిన రూ.1200 కోట్ల రూపాయల బకాయిలను రాకుండా చేస్తుందని ఆరోపించారు. ప్రతి సంవత్సరం కేటాయింపులను తగ్గిస్తుంది అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాను గ్రామీణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు అన్ని రంగాలలో పురోగమిస్తున్నాయని అన్నారు. 9 కేటగిరీల్లో మొదటి 3 స్థానాల్లో ఉత్తమంగా నిలిచిన జిల్లాలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Minister ktr, Siricilla, Telangana