(హరి, న్యూస్18 తెలుగు, సిరిసిల్ల)
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది ఈ రోడ్డు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల శివారులోని రాపల్లి వాగుపైబ్రిడ్జి నిర్మాణ పనులు, అటవీ గ్రామాలకు ప్రధాన రహదారిగా మారిన రోడ్డు నిర్మాణ పనులు మాత్రం అంసపూర్తిగా మిగిలిపోవడంతో ప్రమాదాలకు నెలవుగామారుతోంది. బ్రిడ్జి నిర్మాణ పనులు కంప్లీట్ అయినా.. ఇరువైపుల రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కంకర రహదారిపైప్రయాణించేందుకు వాహనదారులు జంకుతున్నారు. ప్రమాదాలతో హాస్పిటల్ పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు, ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులోని రాపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సర్కార్ రూ.2.40 కోట్ల సీఆర్ఆర్ నిధులను 2 సంవత్సరాల కిందట మంజూరు చేసింది.
బ్రిడ్జికి ఇరు వైపులు 130 మీటర్ల దూరం తారు రోడ్డుకు అదనంగా మరో రూ.18 లక్షలను కేటాయించింది ప్రభుత్వం. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్.. నిర్మాణ పనులు నత్తనడకన సాగించడంతో.. భారీ వర్షాలకు తాత్కాలిక రహదారి 3 సార్లు కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు స్తంభించిన విషయం మనందరికీ తెలిసిందే. బ్రిడ్జ్ నిర్మాణ పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్ ఇరువైపులా కంకర రోడ్డు వేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఆ దారి వెంట ప్రయాణించే అక్కపల్లి, అల్మాస్పూర్, దుమాల, వీర్నపల్లి మండలాల్లోని ఆయా గ్రామాల వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదుపుతప్పి ద్విచక్ర వాహనాలు ప్రమాదాల గురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
ఇక్కడ రోడ్డు పక్కన రక్షణ కోసం రెయిలింగ్ లేకపోవడంతో చీకటి సమయంలో పంట పొలాల్లోకి దూసుకెళ్తున్నాయి. నిత్యం ప్రమాదాల సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా కంకర వేసిన రోడ్డుపై తారు వేసి రవాణా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు వాహనదారులు. మంత్రి కేటీఆర్ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ కంకర రోడ్డుపై తారు రోడ్డు త్వరగా వేయించాలని కోరుతున్నారు. అధికారులు నాణ్యమైన రోడ్డును వేసి త్వరగా పూర్తిచేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు వేడుకుంటున్నారు.
గ్రామ శివారులోని రాపల్లి వాగుపై బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, రెండు వైపులా తారు రోడ్డు పనులు కొనసాగుతున్నాయని ఆర్ అండ్ బీ డీఈ రవీందర్ తెలిపారు. కంకర రహదారిపై తారువేసేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పనులు వేగవంతం చేయాలని సదర్ కాంట్రాక్టర్ను అదేశించి పనులు పూర్తి చేస్తామని ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Sircilla, Telangana