రిపోర్టర్ : హరి
లొకేషన్ : రాజన్న సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలుసార్లు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు కేజీ స్థాయి నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ దిశగా తొలి అడుగు పడింది.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ..
రహేజా ఫౌండేషన్ సహకారంతో తెలంగాణలో కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఒకే చోట విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తొలి విద్యాలయం నిర్మాణం పూర్తి అయింది. రాజన్న సిరిసిల్లాలోని గంభీరావుపేటలో తొలి కేజీ టూ పీజీ ప్రాంగణాన్ని నిర్మించారు.ఫిబ్రవరి 1వ తేదీన మంత్రులు కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ఎడ్యుకేషన్ హబ్ లో అన్ని సదుపాయాలు:-
గంభిరావు పేట మండల కేంద్రంలోని ఆరెకరాల విస్తీర్ణంలో కేజీ టూ పీజీ విద్యా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్లా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం, చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధమవుతున్నాయి.
అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వసతులతో వంట గదితో పాటు సామగ్రిని నిల్వ చేసేందుకు ప్రత్యేక గదులను నిర్మించనున్నారు. 50 కంప్యూటర్లతో నైపుణ్యాభివృద్ధి శిక్షణకేంద్రం సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ వసతులతో 4500 చదరపు అడుగుల్లో క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నారు. 45వేల చదరపు అడుగులలో క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్ ట్రాక్తో కూడిన ఎఫ్ఐఎఫ్ఏ స్టాండర్డ్ ఆస్ట్రో టర్ఫ్ ప్లే మైదానంగా తీర్చిదిద్దారు. త్వరలోనే ఈ క్యాంపస్ ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు .
ప్రత్యేకతలు ఇవే:-
1.ప్రీప్రైమరీ నుంచి పోస్ట్గ్రాడ్యుయేషన్ దాకా ఒకే చోట చదువు
2.3500 మంది విద్యార్థులు విద్యనభ్యసించే అవకాశం
3.అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో క్రీడా మైదానం
4.1000 మంది భుజించేలా డైనింగ్హాల్
5.ఇంకా డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్
6.ఇప్పటికే అందుబాటులోకి డిగ్రీ, బాలుర ఉన్నత పాఠశాల గదులు
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..
రాజన్న సిరిసిల్లాలోని గంభీరావుపేటలో తొలి కేజీ టూ పీజీ ప్రాంగణాన్ని ఫిబ్రవరి 1వ తేదీన మంత్రులుకే.తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి.శ్రీనివాస్ రావు, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. అన్ని సదుపాయాలతో కూడిన అద్భుతమైనకేజీ టూ పీజీ ప్రాంగణంను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడం వెనుక మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ, కృషి వల్లే సాధ్యమైందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సహకారం అందించిన ఏజెన్సీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యా శాఖకు శుభాకాంక్షలు తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద తొలి విడతలో జిల్లాలో 172 ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు పెంపొందించే పనులు చేపట్టినట్లు తెలిపారు. మోడల్ స్కూల్ లుగా ఎంపిక చేసి పనుల చేపట్టిన 26 ప్రభుత్వ పాఠశాలలను రేపు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana