విశ్వనగరం హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ మహమ్మారి పెను కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పబ్బుపై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు జరిపిన దాడుల్లో అక్కడ డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. మద్యం, డ్రగ్స్ సేవిస్తూ వందలమంది యువతీ యువకులు పోలీసులకు చిక్కారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నవాళ్లలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి కూతురు నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార యాదవ్ కొడుకు అరవింద్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కుమారుడు, ఓ మాజీ డీజీపీ కుమార్తె తోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు, రాజకీయ ప్రముఖుల సంతానం అంతా కలిపి 144 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ బ్లూ పబ్బులో డ్రగ్స్ వాడకంపై సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లలకు పోలీసులు నోటీసులిచ్చారు. అదే సమయంలో ఈ కేసు పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. డ్రగ్స్ సరఫరాను అడ్డుకోలేకపోయిన కారణంగా అధికారులపై స్పెన్షన్ వేటు వేశారు. కానీ సెలబ్రిటీల పిల్లలను కాపాడేందుకే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. డ్రగ్స్ సూత్రధారులను ఎక్ కౌంటర్ చేయాలనీ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి..
రాడిసన్ పబ్ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. బంజారాహిల్స్ పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెల్లుతున్నాయి. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ పబ్లో గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. పబ్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూతురుది కావడంతో బంజారాహిల్స్ పోలీసులు చూసి చూడనట్లు వదిలేసినట్టు సమాచారం. రాత్రి మూడు గంటలు వరకూ పబ్ నడిచినా పోలీసులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తోంది. శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ బలగాలు జరిపిన దాడుల్లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చర్యలకు దిగారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) శివ చంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కు చార్జి మెమో జారీ అయింది.
బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులపైనా విమర్శలు వస్తున్నాయి. మెగా డాటర్ నిహారికను పీఎస్ కు తీసురాకుండా బయటకు పంపించడంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడిందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ నిర్వాహకులు ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో విచారిస్తున్నారు. బడాబాబుల పిల్లలు ఉండటంతో కేసును పక్కాగా డీల్ చేయాలని సీపీ ఆనంద్ నిర్దేశించినట్లు తెలుస్తోంది.
పబ్బులో డ్రగ్స్ పార్టీ ఉదంతం రాజకీయంగానూ కలకలం రేపింది. మాదకద్రవ్యాలు సేవించినవారిలో రాజకీయ నేతలు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పిల్లలూ ఉన్నట్లు వెల్లడవుతోన్న దరిమిలా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రెండురోజులు హడావుడి చేసి కేసును వదిలేయొద్దన్నారు. డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే డ్రగ్స్ అమ్మేవారిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. ఈ విషయంలో కేసీఆర్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాజాసింగ్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drugs case, Hyderabad, Hyderabad police, Niharika konidela, Rahul sipligunj, Tollywood drugs case