తెలంగాణలో (Telangana) గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించారో.. అలాగే బీసీలకు ఉన్న 29 శాతం రిజర్వేషన్లను 50 శాతం కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (National President of BC Welfare Association R Krishnaiah) డిమాండ్ చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం (World Bamboo Day) పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లాలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చట్టసభల్లో, పంచాయతీరాజ్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఎవరూ నిద్రపోవద్దని ఆర్.కృష్ణయ్య సూచించారు. బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలని తాను బీసీ కోసం చట్టసభల్లో పోరాడుతున్నానని వివరించారు.
తట్ట, బుట్ట, గంప..
ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రపంచ నాగరికతకు పునాది వెదురు అని చెప్పారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం పెరిగిన తర్వాత వెదురు వృత్తి దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి కాటివరకు వెదురు, మేదరులు లేనిది జీవనం ముందుకు సాగడం కష్టం అని ఆర్.కృష్ణయ్య అన్నారు. గతంలో వెదురుతో మేదరులు జీవనం కొనసాగించే వారని గుర్తు చేశారు. తట్ట, బుట్ట, గంప సాట ఇలా మనిషి జీవన విధానంలో ప్రథమ భూమిక మేదరిదన్నారు.
కులాలకు ప్రభుత్వాలు ఏం ఇచ్చాయని..
ఇక కులాభివృద్ధిలో చదువు కీలకంమని కృష్ణయ్య అన్నారు. పుట్టినప్పటి నుంచి పుట్టెడు కష్టాలతో మేదరి కులం ఉందన్నారు. సమాజానికి ఉపయోగపడే కులవృత్తులు చేస్తున్న కులాలకు ప్రభుత్వాలు ఏం ఇచ్చాయని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ప్రతి కులాభివృద్ధిలో చదువు కీలకం.. దానితో అధికారం చేతికొస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు వేల హాస్టళ్లు ఉన్నాయన్న ఆయన.. గురుకులాల కోసం కొట్లాడితే 1,200 గురుకురాలు మంజూరయ్యాయని తెలిపారు ఆర్.కృష్ణయ్య .
సీఎం ప్రకటనతో..
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం (Telangana National Integrity Day) వేళ సీఎం కేసీఆర్ (CM KCR) సంచలన ప్రకటన చేశారు. గిరిజనులకు 10 రిజర్వేషన్లను (10% Percent Reservations For tribals) అమలు చేస్తామని.. వారం రోజుల్లోనే జీవో వస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదించినా.. లేకున్నా.. తాము మాత్రం గిరిజన రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని తెగేసి చెప్పారు. ఇవాళ ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటయ్యాక గిరిజనుల రిజర్వేషన్ను 10శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా.. ఇప్పటికీ స్పందన లేదని విమర్శించారు. కేంద్రానికి మొరపెట్టుకొని.. విసిగిపోయామని..ఇక ఓపిక లేదని.. వారం రోజుల్లోనే రిజర్వేషన్ల జీవోను జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ జీవోను గౌరవించి అమలు చేస్తావా? లేదంటే దానిని ఉరి తాడు చేసుకుంటావా? అని ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bc study circle, CM KCR, Hyderabad, Telangana Government